IT News: బెంగళూరు ఐటీ కంపెనీ షాక్.. 10 నెలలుగా అదే తీరు.. సోషల్ మీడియాలో ప్రశ్నించినా..
IT News: ఐటీ ఉద్యోగం అనే కల చాలా మందికి ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. పేరుకే ఉద్యోగాలు వస్తున్నాయి కానీ.. ఆఫీసులకు వెళ్లటానికి కంపెనీల నుంచి పిలుపు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు చాలా మంది టెక్కీలు. ఇంతకు ముందు విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్, క్యాప్జెమినీ, యాక్సెంచర్, మైండ్ట్రీ వంటి చేసిన పనినే మరో ఐటీ కంపెనీ చేస్తోంది.
ఎంపికైన వారికి రిక్త హస్తం..
అనేక రౌండ్స్ ఇంటర్వ్యూలు క్లియర్ చేసుకుని ఐటీ ఉద్యోగం సంపాదించిన చాలా మందికి కంపెనీలు చుక్కులు చూపిస్తున్నాయి. ఆన్బోర్డింగ్ ప్రక్రియను రోజులు వారాలు కాకుండా ఏకంగా నెలల తరబడి ఆలస్యం చేస్తున్నాయి. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ Mphasis సైతం ఇదే పని చేస్తోంది.
నెలల తరబడి..
ఎంపికైన ఉద్యోగులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్(LoI) ఇచ్చిన Mphasis వారికి ఆన్బోర్డింగ్ తేదీ ఇవ్వకుండా నెలలతరబడి వేచి ఉంచుతోంది. అయితే తనను 10 నెలలపాటు వెయిటింగ్ లో ఉంచారని, తాను ఇంకా వేచి ఉన్నప్పటికీ కంపెనీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదని వాపోయాడు. తాను కంపెనీ నుంచి 2021లో LoIని పొందినట్లు వెల్లడించాడు. ఇదొక చట్టబద్దమైన ఒప్పందం.
ఇటీవల గ్రాడ్యూయేట్..
ఇటీవలి గ్రాడ్యుయేట్ అయిన మరొక కొత్త రిక్రూట్ మాట్లాడుతూ.. తనలాంటి చాలా మంది ఫ్రెషర్లు కంపెనీలో చేరటానికి నెలల తరబడి వేచి ఉన్నారని వెల్లడించాడు. తమ జాయినింగ్ డేట్ చెప్పాలంటూ కంపెనీని సంప్రదించామని, సోషల్ మీడియా వేధికగా కూడా పోస్ట్ చేశామని.. కానీ కంపెనీ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని విచారం వ్యక్తం చేశాడు.
రెండు ఉద్యోగులు- NO Income..
మరో వ్యక్తి దీనిపై స్పందిస్తూ.. తనకు రెండు జాబ్ ఆఫర్లు వచ్చాయని ఒకటి విప్రోలో, మరొకటి ఎంఫసిస్ లో అని తెలిపాడు. అయితే.. తనను ఏ కంపెనీ ఉద్యోగానికి ఇంకా పిలవలేదని.. తనకు ఎలాంటి ఆదాయం లేదని తెలిపాడు. అన్ని కంపెనీలు ఆన్బోర్డింగ్ తేదీలను ఆలస్యం చేస్తున్నాయని, తన స్నేహితుడు సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఇదే పెద్ద సమస్య..
కంపెనీలు ఆన్ బోర్డింగ్ లేటు చేయటం వల్ల ఫ్రెషర్లపై అది పెద్ద ప్రభావం చూపుతోంది. దీని వల్ల తమ CVలో ఈ గ్యాప్ తర్వాత కెరీర్ లో అవకాశాలు పొందేందుకు ఆటంకంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమస్య ఎదుర్కొంటున ఒక వ్యక్తి తనకు ఎంఫసిస్, ఇన్ఫోసిస్ నుంచి ఆఫర్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.