సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఇరాన్.. టెక్ దిగ్గజాల గుండెల్లో వణుకు.. రుసుము చెల్లించకుంటే కేబుల్స్ కట్..
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముగింపు లేని యుద్ధ వాతావరణం, అలాగే వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న దిగ్బంధం కారణంగా ప్రపంచం ఇప్పటికే తీవ్రమైన ముడిచమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ తన ఆర్థిక అవసరాల కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఆ జలమార్గం గుండా సముద్రగర్భంలో విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ ఇప్పుడు తన దృష్టిని కేంద్రీకరించింది.
గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలు ఈ సముద్రగర్భ కేబుళ్లను ఉపయోగించుకుంటున్నందుకు గాను వాటి నుండి భారీగా రుసుములు (ఫీజులు) వసూలు చేయాలని ఇరాన్ యోచిస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థ 'సీఎన్ఎన్' వెల్లడించింది. ఈ విషయాన్ని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహిం జోల్ఫాఘరీ గత వారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ అంతర్జాతీయ కేబుళ్ల వినియోగానికి చెల్లింపులు జరపాలని ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఇరాన్పై అమెరికా విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను అతిక్రమించకుండా, గూగుల్, మెటా, అమెజాన్ వంటి అమెరికన్ కంపెనీలు ఇరాన్ ప్రభుత్వానికి ఎలా చెల్లింపులు చేయగలవనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. అంతర్జాతీయ చట్టాలు, ఆంక్షల నేపథ్యంలో ఈ చెల్లింపుల ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది.
భౌగోళికంగా పరిశీలిస్తే, భారతదేశం, ఆగ్నేయాసియా దేశాలను గల్ఫ్ దేశాలు, ఈజిప్టు మీదుగా ఐరోపాతో అనుసంధానించే అనేక కీలకమైన ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లు ఈ హార్ముజ్ జలసంధి సముద్రగర్భంలో పాములా విస్తరించి ఉన్నాయి. సముద్రగర్భ కేబుళ్లు (సబ్మెరైన్ కేబుల్స్) అనేవి ప్రపంచవ్యాప్తంగా డేటా మరియు విద్యుత్తును ప్రసారం చేయడానికి సముద్రపు అడుగుభాగంలో అమర్చిన అత్యంత ఆధునిక ఫైబర్-ఆప్టిక్ వ్యవస్థలు.
ఐక్యరాజ్యసమితికి చెందిన డిజిటల్ టెక్నాలజీల ప్రత్యేక సంస్థ 'ఏటీయూ' నివేదికల ప్రకారం.. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 99 శాతం ఈ సముద్రగర్భ కేబుళ్ల ద్వారానే సాగుతుంది. వివిధ దేశాల మధ్య టెలికమ్యూనికేషన్లు, క్లౌడ్ సేవలు, గ్లోబల్ ఆన్లైన్ కమ్యూనికేషన్లు, ఆర్థిక వ్యవస్థల నిర్వహణకు ఇవి వెన్నెముక లాంటివి.
హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని ప్రధాన కేబుల్ వ్యవస్థలను పరిశీలిస్తే:
ఆసియా-ఆఫ్రికా-యూరప్ 1 (AAE-1): ఇది ఆగ్నేయాసియాను ఈజిప్టు ద్వారా ఐరోపాకు అనుసంధానిస్తుంది. దీనికి యూఏఈ, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాలలో ల్యాండింగ్ పాయింట్లు ఉన్నాయి.
ఫాల్కన్ నెట్వర్క్ (Falcon Network): ఇది భారతదేశం, శ్రీలంక దేశాలను గల్ఫ్ దేశాలతో పాటు సూడాన్, ఈజిప్టులతో కలుపుతుంది.
గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ (GBI): ఈ కేబుల్ వ్యవస్థ ఇరాన్తో సహా దాదాపు అన్ని గల్ఫ్ దేశాలను అంతర్జాతీయ నెట్వర్క్తో అనుసంధానిస్తుంది.
ప్రముఖ భౌగోళిక రాజకీయ, ఇంధన విశ్లేషకురాలు మాషా కోట్కిన్ అభిప్రాయం ప్రకారం.. ఒకవేళ ఇరాన్ చర్యల వల్ల లేదా మరేదైనా కారణం చేత ఈ కేబుళ్లు దెబ్బతింటే అంతర్జాతీయంగా ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలుతుంది. ఇంటర్నెట్ వేగం మందగించడం, డిజిటల్ కమ్యూనికేషన్లు నిలిచిపోవడం, ప్రపంచ ఈ-కామర్స్ వ్యాపారాలు దెబ్బతినడం, బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక లావాదేవీలు ఆలస్యం కావడం వంటి తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చమురు సంక్షోభం తర్వాత ఇప్పుడు ప్రపంచం డిజిటల్ లేదా డేటా సంక్షోభంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
