ఇన్ఫోసిస్ చేతికి అమెరికన్ మెడికల్ డివైజ్ కంపెనీ: డీల్ విలువ రూ. 300 కోట్లు
బెంగళూరు/న్యూయార్క్: ప్రముఖ దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా అమెరికాకు చెందిన కెలీడోస్కోప్ ఇన్నోవేషన్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. ప్రోడక్ట్ డిజైన్, డెవలప్మెంట్ చేసే ఈ కంపెనీని కొనుగోలు చేసే డీల్ విలువ దాదాపు 42 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 308 కోట్లు).
కాగా, మైక్రో సర్జికల్ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే సాధనాలు మొదలైనవి కెలీడోస్కోప్ రూపొందిస్తుంది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 20.6 మిలియన్ డాలర్లుగా ఉంది.
తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ద్వారా కెలీడోస్కోప్ కొనుగోలు జరిగిందని ఇన్ఫీ వెల్లడించింది. 2021 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికలో పూర్తి కాగలదని వెల్లడించింది.
'ఈ కంపెనీ కొనుగోలు కొత్త సాఫ్ట్వేర్ సాంకేతిక పరిజ్ఞానం, వైద్య పరికరాల కూడలిలో మా డిజిటల్ సమర్పణలను మరింత బలపరుస్తుంది. కోవిడ్ అనంతర కాలంలో గణనీయమైన పెట్టుబడులు, వినియోగదారులని చూడవచ్చు' అని ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ రవి కుమార్ తెలిపారు. కాగా, ఇన్ఫోసిస్, దాని సీఈఓ సలీల్ పరేఖ్ ఆధ్వర్యంలో నూతన సాంకేతిక రంగాలలో తన సామర్థ్యాలను పెంచుకుంటోంది.
పరేఖ్ ఆధ్వర్యంలో తాజా కొనుగోలు ఆరోది కావడం గమనార్హం. ఇప్పటి వరకు సింప్లస్, ఫ్లూయిడో ఉన్నాయి, ఇవి రెండూ కూడా సేల్స్ ఫోర్స్ భాగస్వాములు, యాడ్ టెక్ కంపెనీ వాంగ్డూడీ, ఎబిఎన్ అమ్రో బ్యాంక్, హిటాచి ప్రొక్యూర్మెంట్ సర్వీస్ యొక్క అనుబంధ సంస్థ అయిన స్టేటర్ కూడా ఉన్నాయి. క్లౌడ్ లేదా డేటా, డిజిటల్ ఫోకస్ అంశాలను బట్టి కంపెనీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు గతంలోనే పరేఖ్ తెలిపారు. గత మూడేళ్లలోనే కొనుగోళ్ల ఒప్పందం విలువ 600 మిలియన్ డాలర్లను మించి ఉందని చెప్పారు.