Covid 19: ఉద్యోగులకు విమానసంస్థ షాక్, ఏడాదంతా వేతనం కట్
సీనియర్ ఉద్యోగులకు ఇండిగో విమానయాన సంస్థ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కరోనా కారణంగా విమానయాన రంగం భారీ నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు సహా దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం చేస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థ మరింత దారుణం: అమెరికా-చైనా ట్రేడ్ వార్తో కరోనా రికవరీపై దెబ్బ
ఏడాదంతా కోత
కరోనా ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొత్తంగా జీతాల్లో 25% వరకు కోత ఉంటుందని శనివారం ఇండిగో ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలోనే మళ్లీ పూర్తి వేతనాల గురించి ఆలోచిస్తామని తెలిపింది. మే, జూన్, జూలై నెలలకుగాను 5% నుంచి 25% వరకు వేతనాల్లో కోత పెడుతున్నట్లు శుక్రవారమే ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది మార్చి దాకా పొడిగిస్తున్నట్లు తర్వాత ప్రకటించింది. మే, జూన్, జూలై నెలలకు గాను వేతనం లేని సెలవులు కూడా సీనియర్ ఉద్యోగులకు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ పూర్తి వేతనం
ఇండిగో ఏప్రిల్ నెలకు గాను ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లించింది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం మొత్తం వేతనాల కోత విధించాలని నిర్ణయించింది. తొలుత మార్చి 19న శాలరీ కట్స్ ప్రకటించింది. ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. తిరిగి శుక్రవారం పే-కట్స్ ప్రకటించింది. శనివారం సీనియర్ ఉద్యోగులకు ఏడాదంతా వేతనం కట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రూ.25,000 కోట్ల ఆదాయ నష్టం
కాగా, కరోనా విమాయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని క్రిసిల్ ఇటీవల వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంపై రూ.24,000 కోట్ల నుండి రూ.25,000 కోట్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని అంచనా వేసింది. విమానయాన సంస్తలు మరీ దారుణంగా దెబ్బతిన్నాయని, మొత్తం ఆదాయ నష్టంలో 70 శాతం వాటా వీటి వాటానే ఉంటుందని క్రిసిల్ పేర్కొంది.