Wipro: ఉద్యోగులను తొలగించిన ఐటీ దిగ్గజం విప్రో.. టెక్కీలకు ప్రమాదం తప్పదా..?
Wipro Layoff's: భారత ఐటీ సేవల దిగ్గజం విప్రో మరోసారి సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఈ సారి కంపెనీ తన వ్యూహాల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో టెక్కీల్లో మళ్లీ ఆందోళనలు మెుదలయ్యాయి.
దేశీయ ఐటీ సేవల రంగంలో విప్రో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న అనిశ్చితుల నేపథ్యంలో కంపెనీ పరిస్థితులకు అనుగుణంగా తన ప్రణాళికలను మార్చుకుంటోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 120 మంది టెక్కీలను తొలగించాలని నిర్ణయించింది. వ్యాపార అవసరాల పునఃసృష్టిలో భాగంగా అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులను కంపెనీ తొలగించనుంది.
ప్రస్తుతానికి యూఎస్ టంపాలో మాత్రమే కోతలు ఉన్నాయి. ప్రభావిత ఉద్యోగుల్లో 100 మందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్ స్థాయి ఉద్యోగులను సమాచారం. ఈ నిర్ణయం రీలైన్మెంట్ లో భాగంగా వచ్చినప్పటికీ టంపా ఏరియాలో క్లయింట్లకు సేవలందిస్తున్న ఇతర విప్రో ఉద్యోగులందరూ ప్రభావితం కాలేదు. మే నెలలో కంపెనీ ఉద్యోగుల శాశ్వత తొలగింపులను ప్రారంభించనుంది.
ఈ భారతీయ టెక్ దిగ్గజం అమెరికా, కెనడా, మెక్సికో, బ్రెజిల్ దేశాల్లో మెుత్తంగా 20,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ 66 దేశాల్లో 2,50,000 మంది ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములను కలిగి ఉంది. ఈ నెల ప్రారంభంలో విప్రో న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్విక్లో అమెరికా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. విప్రో ఆదాయంలో దాదాపు 60 శాతం అమెరికా ప్రాంతం నుంచే వస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నల్ ఎసెస్మెంట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన దాదాపు 400 మంది ఫెషర్లను తొలగించిన తర్వాత తాజాగా కంపెనీ అమెరికాలో ఉద్యోగులను తొలగించింది.