Economic Survey: V షేప్ రికవరీ: CEA కృష్ణమూర్తి సుబ్రమణియన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీ కనిపిస్తోందని చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ (CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. ఆరోగ్యం, ఆర్థిక రంగాలు ఆశావాహంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. భారత్ రోడ్ అండ్ డెవలప్మెంట్స్ పైన గ్రాస్ ఎక్స్పెండిచర్ను జీడీపీలో 1.5 శాతం నుండి 3 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. మన దేశ ఆర్థిక విధానాలకు మానవీయవిలువలే స్ఫూర్తి అన్నారు.
ప్రమాదంలో ఉన్న ప్రమాణాన్ని కాపాడటం ధర్మానికి మూలధారమని మహాభారతం చెబుతోందని, ఈ మానవీయ సిద్ధాంతం నుండే కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక విధానాలు రూపొందుతున్నాయని తెలిపారు. పరిపక్వత, దూరదృష్టితో మన విధానాలను రూపొందించినట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక లబ్ధి కోసం స్వల్పకాలిక నష్టాన్ని భారతావని స్వీకరించిందన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంటుకు సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకనమిక్ సర్వే 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి పాఠంగా తీసుకుందన్నారు.
కాగా, భారత చరిత్రలో తొలిసారి గత ఏడాది ఆర్థికమంత్రి ప్యాకేజీల రూపంలో నాలుగైదు మినీ బడ్జెట్లు ప్రవేశ పెట్టినట్లు ఉదయం ప్రధాని మోడీ తెలిపారు. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు ప్యాకేజీని ప్రకటించారు. దీనిని మోడీ గుర్తు చేస్తూ 2020లో మినీ బడ్జెట్లు ప్రవేశ పెట్టామన్నారు.