ఇండియా–యూఎస్ ట్రేడ్ డీల్పై పీయూష్ గోయల్ ప్రకటన.. భారత ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా..
India-US Trade Deal: ఇండియా - యుఎస్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Deal) చర్చలు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు త్వరలోనే ఒక సంయుక్త ప్రకటన (Joint Statement) విడుదల చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ ప్రకటన వచ్చే 4 నుంచి 5 రోజుల్లో వెలువడే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తొలి దశ చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు గోయెల్ తెలిపారు.
న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని గోయల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తొలి దశ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదని కూడా చెప్పారు. సరైన సమయంలో అన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ వాణిజ్య ఒప్పందం పూర్తిగా భారతదేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిందని గోయల్ తెలిపారు. ముఖ్యంగా దేశీయ వ్యవసాయం, డైరీ, పశుసంవర్ధక రంగాలు, అలాగే సున్నితమైన పరిశ్రమలను రక్షించేలా ఒప్పంద నిబంధనలు ఉంటాయని చెప్పారు. పన్నులు (టారిఫ్లు) విషయంలో కూడా సమతుల్యత పాటించామని, దేశీయ ఉత్పత్తిదారులకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఇతర దేశాలతో అమెరికా చేసుకున్న వాణిజ్య ఒప్పందాలతో పోలిస్తే.. భారత్తో కుదుర్చుకుంటున్న ఈ ఒప్పందం అత్యంత లాభదాయకమని గోయల్ వ్యాఖ్యానించారు.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత్-అమెరికా మధ్య వాణిజ్య పరిమాణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాలో భారత పారిశ్రామిక ఉత్పత్తులపై విధిస్తున్న కొన్ని అధిక టారిఫ్లు తగ్గే అవకాశముంది. దీని వల్ల భారత ఉత్పత్తులకు అమెరికన్ మార్కెట్లో పోటీ సామర్థ్యం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కొన్ని రంగాల్లో కొనసాగిన పన్నుల ఒత్తిడి తగ్గితే.. రెండు దేశాల మధ్య వాణిజ్య ప్రవాహం వేగవంతమవుతుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ఒప్పందంపై రాజకీయ వర్గాల్లో చర్చలు, విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గోయల్ మాత్రం ఈ ఒప్పందం పూర్తిగా దేశ ఆర్థిక ప్రయోజనాల కోసమే కుదుర్చుకుంటున్నామని, రైతులు, చిన్న వ్యాపారాలు, MSME రంగాలకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులు మరింత పెరిగే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ సేవలు, టెక్స్టైల్స్, ఇంజినీరింగ్ వస్తువులు, మెకానికల్ భాగాలు వంటి రంగాలకు అమెరికాలో కొత్త అవకాశాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చిన్న, మధ్యస్థ పరిశ్రమలకు ఇది కొత్త మార్కెట్లను తెరవనుంది. రెండు దేశాల నుంచి సంయుక్త ప్రకటన విడుదలైన తర్వాత.. ఈ ఒప్పందం భవిష్యత్తులో భారత్-అమెరికా వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే మైలురాయిగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications


