ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డ్, తగ్గిన బంగారం నిల్వలు
భారత విదేశీ మారకం నిల్వలు రికార్డ్స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 18వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 3.378 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్ టైమ్ హై 545.38 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మన కరెన్సీలో దాదాపు రూ.25వేల కోట్లు పెరిగి 40.87 లక్షల కోట్లకు పెరిగాయి. విదేశీ కరెన్సీ ఆస్తుల్లో పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) తెలిపింది. ఇటీవలి కాలంలో భారత ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత వారం స్వల్పంగా క్షీణించాయి. తిరిగి మరోసారి రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.
చివరలో మురిసిన ఇన్వెస్టర్లు: అమెరికా ఎఫెక్ట్, భారీ నష్టాలతో భారీ కొనుగోళ్లు..
15 నెలల దిగుమతులకు సరిపోయేలా..
జూన్ 5వ తేదీతో ముగిసిన వారంలో మొదటిసారి మన ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్ దాటాయి. 501.464 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు 580 మిలియన్ డాలర్లు తగ్గి 37.440 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆ తర్వాత ఒడిదుడుకులు కనిపించినప్పటికీ నిల్వలు క్రమంగా పెరిగాయి. అంతకుముందు క్రితం వారం ఫారెక్స్ నిల్వలు 353 మిలియన్ డాలర్ల మేర తగ్గి, 541.660 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు భారత్ 15 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. దిగుమతులకు సంబంధించి వ్యయాలు తగ్గడం, విదేశీ ఆస్తులు పెరగడం వంటివి కారణం.
అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద...
అంతర్జాతీయ ద్రవ్య విధి(IMF) వద్ద భారత ప్రత్యేక ఉపసంహరణ హక్కులు(SDR) 1 మిలియన్ డాలర్లు పెరిగి 1.483 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐఎంఎఫ్ వద్ద దేశీయ నిల్వలు 14 మిలియన్ డాలర్లు పెరిగి 4.651 బిలియన్ డాలర్లుగా నమోదయినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
బంగారం నిల్వలు
కాగా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బంగారం నిల్వలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తోన్న విషయం తెలిసిందే. మొత్తం ఈ నిల్వలను పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందట. ఆగస్ట్ 14 సమావేశమైన ఆర్బీఐ బోర్డు పసిడికి అనుకూలంగా నిల్వల్ని పెంచుకునే అంశంపై చర్చించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిల్వలు ఏడు శాతంగా ఉండగా, వీటిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, దీనిపై ఈ నెలలో చర్చించనున్నారని కూడా వార్తలు వచ్చాయి.
1992లో బంగారాన్ని తక్కువ మొత్తానికి అమ్మవలసి వచ్చిందని, నాటి బంగారం నిల్వలు భారత్ రక్షణకు ఉపకరించాయని కొంతమంది చెప్పవచ్చునని, కానీ ప్రస్తుతం మనం ఆ పరిస్థితుల్లోలేమని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో బంగారం నిల్వలు అన్ని సమయాల్లోనూ ఒకేలా ఉపయోగపడవని, అయితే నిల్వల కేటాయింపును విస్తృతే చేయడం మంచిదని చెబుతున్నారు. నిల్వల్లో వైవిధ్యమైన కేటాయింపులు ఉండాలని, గత అయిదేళ్లుగా బంగారు నిల్వలు పెరుగుతూ వస్తున్నాయని, 1991లో ఈ నిల్వలు భారత్కు మద్దతు ఇచ్చాయని, కేటాయింపులు పెంచేందుకు ఆర్బీఐ అవలంభించే వ్యూహాన్ని పరిశీలించాలని అంటున్నారు.