హార్ముజ్ జలసంధికి గుడ్ బై చెప్పిన భారత్.. ప్రత్యామ్నాయ రూట్లలో ఇంధన సరఫరాకు సరికొత్త వ్యూహం..
పశ్చిమ ఆసియాలో రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ యుద్ధ ప్రభావం చమురు సరఫరాపై విపరీతంగా పడుతోంది. ముఖ్యంగా భారతదేశ ఇంధన భద్రత, సరఫరా మార్గాల స్వరూపాన్ని ఇది పూర్తిగా మారుస్తోంది.
యుద్ధం కారణంగా ఎదురవుతున్న తీవ్రమైన ప్రమాదాలను నివారించేందుకు.. భారతీయ రిఫైనరీలు, చమురు దిగుమతిదారులు సరికొత్త వ్యూహాత్మక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ ప్రాంతం నుండి ఇంధన సరఫరాలను సురక్షితంగా భారతదేశానికి చేర్చడానికి, వారు సాంప్రదాయకంగా ఉపయోగించే అత్యంత సంక్లిష్టమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) షిప్పింగ్ మార్గానికి వెలుపల ఉన్న ఒమన్ గల్ఫ్ వెంబడి గల ఓడరేవులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఫుజైరా, ఖోర్ ఫక్కాన్ ఓడరేవులు ప్రస్తుతం భారతీయ చమురు దిగుమతులకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. వాణిజ్య నౌకలపై దాడులు శరవేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో. హార్ముజ్ జలసంధికి తూర్పు వైపున ఉన్న యూఏఈకి చెందిన ఈ ప్రత్యామ్నాయ ఓడరేవులు భారతదేశ ఇంధన అవసరాలకు ఒక జీవనాధారంగా నిలుస్తున్నాయి. దీనితో పాటు.. ప్రమాదకరమైన జలమార్గాన్ని దాటకుండా ఉండేందుకు భారతీయ రిఫైనరీలు యూఏఈకి చెందిన 406 కిలోమీటర్ల పొడవైన హబ్షాన్-ఫుజైరా వ్యూహాత్మక చమురు పైప్లైన్ను కూడా ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగిస్తున్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు వెల్లడించారు.
అయితే ఈ సరికొత్త ప్రత్యామ్నాయ మార్గాలు భారతదేశానికి కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తున్నప్పటికీ... యుద్ధ మేఘాలు కొత్త ఆందోళనలను రేకెత్తిస్తూనే ఉన్నాయి. ఈ ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను.. రేవులను కూడా తాము లక్ష్యంగా చేసుకుంటామని బుధవారం టెహ్రాన్ (ఇరాన్) హెచ్చరించినట్లు వచ్చిన తాజా నివేదికలు భారతీయ ఇంధన మార్కెట్లో.. దిగుమతిదారులలో సరికొత్త ఆందోళనలకు కారణమవుతున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన అత్యంత వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గల్ఫ్ ప్రాంతం నుండి సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం మార్కెట్ కోలుకోవడానికి కొంత వీలు కల్పించినప్పటికీ.. ఇజ్రాయెల్ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్న ఇరాన్ ఆరోపణల కారణంగా ఈ సంధిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో గల్ఫ్ ఉత్పత్తిదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, యూఏఈలోని హబ్షాన్-ఫుజైరా పైప్లైన్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడ్డారు. అయినప్పటికీ భారతదేశంలోని రిఫైనరీలు తమ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి రష్యా, వెనిజులా, అట్లాంటిక్ బేసిన్ బ్యారెళ్ల వైపు తమ మొగ్గును భారీగా పెంచాయి.
ఈ సంక్షోభ సమయంలో భారతదేశానికి ఇంధనాన్ని అందించే అగ్రగామి సరఫరాదారుగా మాస్కో (రష్యా) తన ఆధిక్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. గత నెలలో రోజుకు 1.91 మిలియన్ బ్యారెల్స్ (bpd)గా ఉన్న రష్యా ముడి చమురు దిగుమతులు, జూన్ నాటికి ఏకంగా 2.66 మిలియన్ bpdకి చేరడం దీనికి నిదర్శనం. హార్ముజ్ అంతరాయం సృష్టించిన గల్ఫ్ రవాణా అనిశ్చితిని తట్టుకోవడంలో యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) సరఫరాల స్థిరత్వం కూడా దేశానికి ఎంతగానో సహాయపడింది.
యూఏఈ నుండి చమురు రవాణా మే నెలలో నమోదైన రికార్డు స్థాయికి దగ్గరగా రోజుకు 636,000 బ్యారెళ్ల వద్ద నిలకడగా కొనసాగింది. భవిష్యత్తులో హార్ముజ్ జలసంధి పూర్తిగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్తో పోలిస్తే బ్యారెల్కు 4 నుండి 5 డాలర్ల వరకు లభిస్తున్న ఆకర్షణీయమైన రాయితీలు (Discounts).. దేశీయంగా ఉన్న స్థిరమైన డిమాండ్ కారణంగా భారతీయ దిగుమతుల బుట్టలో రష్యన్ ముడి చమురు అత్యంత ప్రధాన భాగంగా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, రష్యాకు ప్రత్యామ్నాయంగా వెనిజులా, ఇతర అట్లాంటిక్ బేసిన్ వనరుల వైపు మళ్లడం వల్ల భారతదేశానికి అధిక గ్రేడ్ చమురు లభిస్తున్నప్పటికీ.. ఇది అంతర్జాతీయ ఆంక్షలు, ఉత్పత్తి పరమైన నష్టాలతో కూడుకున్న వ్యవహారంగా మారింది.


Click it and Unblock the Notifications
