చైనా దూకుడుకి బ్రేక్ వేసిన భారత్..మూడేళ్లపాటు ఉక్కు దిగుమతులపై సుంకం.. కారణం ఏంటంటే..
పొరుగు దేశం చైనా నుంచి పెరుగుతున్న చౌక ఉక్కు దిగుమతులను నియంత్రించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఉక్కు ఉత్పత్తులపై మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకం (సేఫ్గార్డ్ డ్యూటీ) విధిస్తున్నట్లు డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ సుంకం శాతం వారీగా తగ్గుతూ అమలులో ఉంటుంది. మొదటి సంవత్సరంలో 12 శాతం, రెండో సంవత్సరంలో 11.5 శాతం, మూడో సంవత్సరంలో 11 శాతంగా ఈ దిగుమతి సుంకం అమలవుతుంది.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న భారత్కు.. ఇటీవలి కాలంలో చైనా నుంచి భారీగా తక్కువ ధరలకు ఉక్కు దిగుమతులు పెరిగాయి. ఈ దిగుమతులు దేశీయ ఉక్కు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా డంపింగ్ విధానాల ద్వారా చైనా ఉక్కును తక్కువ ధరలకు మార్కెట్లోకి ప్రవేశపెడుతోందనే ఆరోపణలు పెరిగాయి. దీని వల్ల భారతదేశంలోని ఉక్కు తయారీ సంస్థలు పోటీని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ కొత్త దిగుమతి సుంకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ను ప్రభుత్వం గెజిట్లో ప్రచురించింది. అయితే ఈ సుంకం అన్ని దేశాలకు వర్తించదు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చే ఉక్కు దిగుమతులకు మినహాయింపు ఇవ్వబడింది. కానీ చైనా, వియత్నాం, నేపాల్ దేశాల నుంచి వచ్చే ఉక్కు దిగుమతులు మాత్రం ఈ సుంకానికి లోబడి ఉంటాయి. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు ఈ సుంకం వర్తించదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
చౌక దిగుమతులు, నాసిరకం ఉత్పత్తుల కారణంగా దేశీయ ఉక్కు పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ పలుమార్లు హెచ్చరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (DGTR) నిర్వహించిన విచారణలో.. ఇటీవల అకస్మాత్తుగా, భారీగా దిగుమతులు పెరగడం వల్ల దేశీయ పరిశ్రమకు తీవ్రమైన నష్టం కలిగే ప్రమాదం ఉందని తేలింది. ఈ నివేదిక ఆధారంగానే మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాన్ని విధించాలని DGTR సిఫార్సు చేసింది.
ఇది భారత్ తీసుకున్న మొదటి చర్య కాదని చెప్పవచ్చు. ఇప్పటికే 2025 ఏప్రిల్లో, విదేశీ దేశాల నుంచి వచ్చే అన్ని Steel దిగుమతులపై 200 రోజుల పాటు 12 శాతం తాత్కాలిక సుంకాన్ని ప్రభుత్వం విధించింది. ఆ తాత్కాలిక సుంకం నవంబర్ 2025లో ముగిసింది. తాజా నిర్ణయం ఆ చర్యకు కొనసాగింపుగా భావించవచ్చు.
ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ISSDA) వంటి పరిశ్రమ సంస్థలు ఈ సమస్యను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 2025 ఆగస్టులోచౌక ఉక్కు దిగుమతులపై యాంటీ-డంపింగ్ సుంకాలు విధించాలని కోరుతూ DGTRకు పిటిషన్ కూడా దాఖలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా చైనా ఉక్కు ఎగుమతులపై వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్కుపై దిగుమతి సుంకాలు విధించడంతో, చైనా ఉక్కు ఎగుమతులు ఇతర మార్కెట్ల వైపు మళ్లాయి. దీనివల్ల అనేక దేశాలు తమ దేశీయ పరిశ్రమలను రక్షించుకునేందుకు కఠిన వాణిజ్య చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియా, వియత్నాం కూడా చైనా ఉక్కుపై యాంటీ-డంపింగ్ సుంకాలను విధించాయి.


Click it and Unblock the Notifications


