Exports: రికార్డు స్థాయిలో పెరిగిన ఇండియా ఎగుమతులు.. ఈ పథకమే కారణమా..?
Exports: ఓ దేశ ఆర్థిక వ్యవస్థలో ఎగుమతులు, దిగుమతులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఎగుమతులను పెంచుకుంటూ, దిగుమతులు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంపై ఇండియా ఇటీవల పెద్దఎత్తున ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. మేకిన్ ఇండియా, లోకల్ ఫర్ ఓకల్ వంటి పలు స్కీంలు ఇందులో భాగమే. అవి సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
2022-2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం ఎగుమతులు 775.87 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2021-22లో చూస్తే ఈ విలువ 676.53 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ రెండింటినీ పోల్చి చూస్తే 14 శాతం వృద్ధి సాధించామన్నమాట. దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగానే గతేడాది ఎక్స్పోర్ట్స్ పెరిగినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

FY23లో దేశీయ సరుకులు, సేవల ఎగుమతులు వరుసగా 6.74 మరియు 27.86 శాతం మేర పెరిగాయి. తద్వారా వాటి విలువ 450.43 మరియు 325.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏప్రిల్ 2023-24 నాటికి మొత్తం ఎగుమతులు 65.02 బిలియన్లు కాగా గతేడాది ఇదే నెలలో 63.75 బిలియన్లు. ఇక దిగుమతుల విషయానికి వస్తే, ఏప్రిల్లో సరుకుల దిగుమతులు 58.06 బిలియన్ల నుంచి 14 శాతం తగ్గి 49.90 బిలియన్ల వద్ద స్థిరపడ్డాయి. దీంతో సరుకుల దిగుమతులు 21 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.
భారత తయారీదారులను అంతర్జాతీయ విపణిలో పోటీపడేలా చేయడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఎగుమతులను మెరుగుపరచడానికి, ప్రపంచ సరఫరా గొలుసులో చేర్చడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ప్రారంభించింది. ఏప్రిల్లో చైనా నుంచి భారత్ దిగుమతులు 5.56 శాతం తగ్గి 7.5 బిలియన్ డాలర్లకు చేరాయి. తద్వారా మంచి ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications