IT Raids on BBC: బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను దాడులు.. దిల్లీలో ఏం జరుగుతోంది..
IT Raids on BBC:ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి, ఉద్యోగుల ఫోన్లను కూడా సీజ్ చేసినట్లు సమాచారం.

డాక్యుమెంటరీ తర్వాత..
బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియాలోనూ కంపెనీ తన కార్యకలాపాలను వివిధ భాషల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ప్రధాని మోదీపై గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇది సంచలనంగా మారటంతో సోషల్ మీడియా మాధ్యమాల నుంచి వీడియోలను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దీనిని విపక్షాలతో పాటు, విద్యార్థి సంఘాలు సైతం అస్త్రంగా మార్చుకుని విమర్శలు గుప్పించాయి.

అసలు ఏం జరుగుతోంది..
సోదాలు ప్రారంభించిన ఐటీ అధికారులు ఉద్యోగులను ఇళ్లకు పంపేసినట్లు తెలుస్తోంది. కొన్ని నివేదికలు BBC కార్యాలయాన్ని కూడా సీల్ చేయవచ్చని సూచిస్తున్నాయి. అయితే ఇది సాధారణ సోదాలా లేక రాజకీయ కక్షతో కూడుకున్నవా అని చాలా మంది అంటున్నారు. ఐటీ శాఖకు చెందిన దాదాపు 60-70 మంది బృందం ఈ సోదాల్లో పాల్గొన్నారు. కార్యాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న ఆదాయపు పన్ను అధికారులు బయటి వారిని లోపలికి రాకుండా.. లోపలి వారిని బయటకు వెళ్లకుండా నిరోధించినట్లు సమాచారం. అలాగే సిబ్బంది ఫోన్లు వినియోగించరాదని ఆదేశించారు.
స్పందించిన కాంగ్రెస్ నేత..
బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల దాడులు చేపట్టడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఈ విషయంపై స్పందించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. అదానీ విషయంలో జేపీసీని డిమాండ్ చేస్తున్నామని.. అయితే ప్రభుత్వం బీబీసీ వెనక పడుతోందని అన్నారు. ఈ వ్యవహారంపై స్పందించి కాంగ్రెస్ ఇదొక అప్రకటిత ఎమర్జెన్సీ అని ట్వీట్ చేసింది.

డాక్టుమెంటరీలో ఏముందంటే..
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వివాదాస్పద డాక్యుమెంటరీ సిరీస్ కారణంగా BBC ఇటీవల వార్తల్లో నిలిచింది. 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' పేరుతో దానిని ప్రజల ముందుకు బీబీసీ తీసుకొచ్చింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారు. అప్పట్లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ నాయకత్వాన్ని డాక్టుమెంటరీ ప్రశ్నించింది. అయితే దీనిని సోషల్ మీడియా మాధ్యమాల్లో కనిపించకుండా ట్విట్టర్, యూట్యూబ్ లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డాక్యుమెంటరీని "propaganda piece" అంటూ కొట్టిపారేసింది.


Click it and Unblock the Notifications