Cipla News: సిప్లా పన్ను ఉల్లంఘనలపై ఐటీ శాఖ దర్యాప్తు.. తప్పుడు క్లెయిమ్స్ చేసిందా..?
Cipla News: భారత ఫార్మా దిగ్గజం సిప్లాను సంభావ్య పన్ను ఉల్లంఘనలు, పన్ను ఎగవేతపై ఆదాయపు పన్ను శాఖ విచారిస్తోంది. అయితే ఇప్పటివరకు పన్ను డిమాండ్ను పెంచలేదని సమాచారం. జనవరి 31న కంపెనీపై సర్వే నిర్వహించిన ఐటీ డిపార్ట్మెంట్ తాజాగా చర్యలు చేపట్టింది.
సెక్షన్ 80-IA కింద సిప్లా తప్పుడు క్లెయిమ్లు చేసిందా లేదా అనే దానిపై పన్ను శాఖ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాథమిక విచారణలో సదరు సెక్షన్ కింద రూ.400 కోట్ల విలువైన క్లెయిమ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పన్ను చట్టాల ప్రకారం ఈ సెక్షన్ కింద నిర్దిష్ట వ్యాపారాల నుంచి 100 శాతం లాభాలను 15 ఏళ్ల బ్లాక్లో 10 వరుస అసెస్మెంట్ సంవత్సరాల పాటు నిర్ణీత వ్యవధి వరకు మాత్రమే తగ్గింపులను పొందేందుకు అనుమతి ఉంటుంది.

రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం సిప్లా కంపెనీ రూ.1,300 కోట్ల విలువైన తప్పుడు తగ్గింపులను పొందిందంటూ ఐటీ శాఖ ఆరోపిస్తోంది. IT చట్టంలోని సెక్షన్- 35 కింద సైంటిఫిక్ రీసెర్చ్ & డెవలప్మెంట్ కోసం చేసే ఖర్చుపై మినహాయింపును పొందవచ్చు. అయితే పన్ను ఎగవేత సొమ్మును కంపెనీ వైద్యులు, వైద్య విపుణులకు ప్రయోజనాలుగా అందించిందని ఐటీ శాఖ ఆరోపించింది.
ఈ వ్యవహారంపై ప్రముఖ మీడియా సంస్థకు సిప్లా ప్రతినిధి బదులిచ్చారు. తమపై ఎలాంటి దావా లేదా డిమాండ్ లేదని ఆయన వెల్లడించారు. ఐటీ అధికారులు అడిగిన పత్రాలు, వివరాలను అందించిందడంలో పూర్తిగా సహకరిస్తోందని కంపెనీ ఫిబ్రవరి 6న ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్లో వెల్లడించింది. ఈ క్రమంలో నేడు సిప్లా షేర్లు 1.9 శాతం తగ్గి రూ. 858.15 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది తాజా 52 వారాల కనిష్ఠ స్థాయిగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications