ఐకియాకు షాక్: లక్షల కొద్దీ ఇండియా ఉత్పత్తులు వెనక్కి!
ప్రముఖ ఫర్నిచర్ తయారీదారు ఐకియా కు భారీ షాక్ తగిలింది. స్వీడన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ ఐన ఐకియాకు మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులతో కొత్త తలనొప్పి వచ్చిపడింది. భారత్ లో తయారైన లక్షలాది ప్లాస్టిక్ మగ్గుల్లో మోతాదుకు మించి రసాయనాలు వాడినట్లు తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసిన లక్షలాది ట్రావెల్ మగ్గులను ఐకియా వెనక్కి తీసుకొస్తోంది. ఇలా సుమారు 400 స్టోర్ల నుంచి ట్రావెల్ మగ్గులను రీకాల్ చేస్తోంది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో దీనిపై కంపెనీ తన వెబ్సైటులో వినియోగదారులకు తగు సూచనలు చేసింది.
మెడికల్ పరంగా ఎలాంటి లోపాలు లేనప్పటికీ... వినియోగదారుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందస్తు చర్యల్లో భాగంగా తాము ఈ చర్యకు ఉపక్రమించినట్లు ఐకియా వెల్లడించింది. ట్రాలీగ్ట్విస్ అనే బ్రాండుతో ఉన్న తమ ట్రావెల్ మగ్స్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని వినియోగదారులకు సూచించింది. ఇందుకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకునేందుకు తమ రిస్క్ అండ్ కంప్లియన్సు బృందం పనిచేస్తుందని, ఆయా ఉత్పత్తుల వల్ల ఎలాంటి హానీ జరిగే అవకాశం ఉన్నట్లు మెడికల్గా తేలకపోయినా, ముందు జాగ్రత్త గా తామే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐకియా ఇండియా ప్రతినిధి వెల్లడించారు.
ఎలా తప్పించుకుందబ్బా...
ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ అయిన ఐకియా తమ ప్రొడక్టుల నాణ్యత సహా ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మోతాదుకు మించి ఏ కెమికల్ వాడినా దానిని వెంటనే రిజెక్ట్ చేస్తుంటుంది. కానీ ప్రస్తుతం వెనక్కి తీసుకొస్తున్న ప్రొడెక్టుల్లో మోతాదుకు మించి డీబీపీ అనే కెమికల్ ను వినియోగించినట్లు తేలింది. దీనిని ప్రోడక్టులు ఎక్కువ కాలం మన్నికగా ఉండేందుకు వినియోగిస్తారు. ఇండియాలో రూ 129 ధర పలికే ట్రోలిగ్వటిస్ మగ్స్ ను కేవలం నాలుగు నెలల క్రితమే ఐకియా గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతులు ప్రారంభించింది. ఇంతలోనే వాటిని వెనక్కి తీసుకు రావాల్సిన పరిస్థితి తలెత్తటం నిజంగా ఐకియాకు ఇబ్బందికరం. ఇది అటు మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ కు కూడా కొంత చేటు చేయగలదని భావిస్తున్నారు.
వెనక్కి ఇస్తే ఫుల్ రిఫండ్..
ఈ ట్రావెల్ మగ్స్ ఎవరు కొనుగోలు చేసినా... వాటిని వెంటనే తిరిగి ఇచ్చేయవచ్చు. అలాగే వాటికి ఎటువంటి కొనుగోలు ప్రూఫ్స్ (బిల్లులు) చూపాల్సిన పనిలేదు. పూర్తిగా రిఫండ్ అందిస్తాం అని ఐకియా వెల్లడించింది. ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పింది. ఇందుకోసం ఇండియాలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశామని, ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడ నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది. ఇండియా లో ఐకియా గత 35 ఏళ్లుగా సుమారు 600 మంది సప్లయర్స్ నుంచి వివిధ ప్రొడక్టులను కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా తమ స్టోర్లలో విక్రయిస్తోంది. కాగా, ప్రస్తుతం వెనక్కి పిలుస్తున్న ప్లాస్టిక్ మగ్స్ దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల నుంచి ఐకియా సేకరిస్తోందని సమాచారం.
ఇళ్ళ ధరల భారీగా పెరుగుదల, వరల్డ్ టాప్ 20లో హైదరాబాద్
50 దేశాలు... 400 స్టోర్లు...
ఐకియా మన దేశం నుంచి కేవలం ఫర్నిచర్ ఉత్పత్తులే కాకుండా ప్లాస్టిక్, టెక్స్టైల్, మెటల్ డెకొరేటివ్స్ కూడా సేకరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఐకియా కు కార్యకలాపాలు ఉన్నాయి. 50 దేశాల్లో సుమారు 400 ఐకియా స్టోర్లు వినియోగదారులకు తమ సేవలు అందిస్తున్నాయి. నాణ్యతకు, మన్నికకు, ధరకు ఐకియా స్టోర్లు పెట్టింది పేరు. ఇండియా లో ఐకియా తన తోలి స్టోర్ ను హైదరాబాద్ లోనే నెలకొల్పటం విశేషం. ఇక్కడ సుమారు 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద ఫర్నిచర్ స్టోర్ ను 2018 ఆగష్టు లో ప్రారంభించింది. ఆన్లైన్ లోనూ ఉత్పత్తులను విక్రయిస్తుంది. హైదరాబాద్ తో పాటు, ముంబై, పూణే నగరాలకు కూడా ఆన్లైన్ సేవలు అందిస్తోంది. ఇండియా లో రూ 10,000 కోట్ల పెట్టుబడితో 25 స్టోర్లు నెలకొల్పాలనేది ఐకియా లక్ష్యం.