భారత పారిశ్రామిక రంగం అక్టోబర్ నెలలో స్తబ్దుగా ఉంది. గత ఏడాది అక్టోబర్ నెలలో స్వల్ప వృద్ధి ప్రభావం (బేస్ ఎఫెక్ట్) తగ్గడంతో ఈ అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP) 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఐఐపీ నిరుత్సాహపూరితంగా సాగడం వరుసగా ఇది రెండో నెల. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ అక్టోబర్ నెలలో ఐఐపీ 129.6 పాయింట్ల నుండి 133.7 పాయింట్లకు చేరుకుంది.
జాతీయ గణాంకాల కార్యాలయం శుక్రవారం గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం ఐఐపీలో 77.63 శాతం వాటా ఉన్న తయారీ రంగం అక్టోబర్ నెలలో 2 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసింది. గనులు 11.4 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

పెరిగిన గ్రామీణ ఆదాయం
అక్టోబర్ పండుగ నెల. అంటే దసరా, దీపావళి పండుగ సీజన్లో సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వృద్ధి తక్కువగానే ఉంది. ఇందుకు ప్రధాన కారణం తయారీ రంగానికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్ వృద్ధికి బ్రేకులు పడ్డాయి. సెమీ కండక్టర్స్ కొరత కారణంగా వాహన పరిశ్రమపై గత కొద్ది నెలలుగా తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే భారత దేశానికి వ్యవసాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి ఊతమిస్తోంది. వ్యవసాయం వల్ల ఆర్థిక రికవరీ వేగవంతమవుతోంది.
వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో వ్యవసాయం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. రబీలో నూనె గింజల సాగు క్రితంసారి కంటే 29.2 శాతం పెరిగింది. ఎరువుల విక్రయాలు పెరిగాయి. ఇప్పటి వరకు ట్రాక్టర్ సేల్స్ గత ఏడాది కంటే 7 శాతం పెరిగాయి. ఖరీఫ్, రబీ పంటకు కనీస మద్దతు ధర పెరిగింది. బియ్యం సేకరణ వల్ల 49 లక్షలమంది రైతులు లబ్ధి పొందారు. దీంతో గ్రామీణ ఆదాయం పెరిగింది.

అన్నింటా సానుకూలతలు
ప్రస్తుతం దేశ ఆర్థిక పురోగతి అన్ని కొలమానాల్లో సానుకూలత కనిపిస్తోంది. మొత్తం 22 హైఫ్రీక్వెన్సీ సూచీల్లో 19 సూచీలు 2021 అక్టోబర్, నవంబర్ నెలల్లో కరోనా ముందునాటి పరిస్థితులను దాటాయి. అంటే 2019 అక్టోబర్, నవంబర్ నెలలను దాటాయి. ఒమిక్రాన్ ప్రపంచ ఆర్థిక పురోగతికి ముప్పుగా పరిణమించవచ్చనే ఆందోళన ఉన్నప్పటికీ దాని తీవ్రత తక్కువగా ఉందని తెలుస్తోంది.
వ్యాక్సినేషన్ పెరిగే కొద్దీ కొత్త రకం వైరస్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగు త్రైమాసికాలు, 2022 ఒకటి, రెండు త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి నమోదు చేసిన దేశాల్లో భారత్ ఉంది.

దూసుకెళ్తున్న భారత్
కరోనా ముందు నాటితో పోలిస్తే భారత్లో ఎగుమతులు 17 శాతం, పెట్టుబడులు 15 శాతం పెరిగాయి. తయారీ, నిర్మాణ రంగాలు కరోనా ముందుస్థాయిని దాటేశాయి. ట్రేడ్, హోటల్, కమ్యూనికేషన్, సేవల స్థూల అదనపు వ్యాల్యూ మెరుగుపడింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 70 శాతం, రెండో త్రైమాసికం నాటికి 90 శాతం రికవరీ సాధించాయి.
బొగ్గు, సిమెంట్, సహజవాయు వినియోగం పెరిగింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో FDIలు 20 బిలియన్ డాలర్లను మించాయి. విదేశీ మారకపు నిల్వలు 640 బిలియన్ డాలర్లు దాటాయి. చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో ద్రవ్యోల్భణం తగ్గుదలకు ఆస్కారం ఏర్పడింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో వృద్ధి కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications