రూ.5 లక్షల రక్షణ, బ్యాంకు డిపాజిటర్లకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మీరు చేసిన డిపాజిట్లపై ఆందోళన ఉందా? బ్యాంకులు మూతబడినా, ఎలాంటి ఆర్థిక ఒత్తిళ్లతో నగదు ఉపసంహరణను నిలిపివేసినా అందులోని డిపాజిటర్లకు తక్షణమే గరిష్టంగా రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సురెన్స్ అందించేలా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. గత ఏడాది పీఎంసీ, యస్ బ్యాంకు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి కస్టమర్లు కొంతమంది తమ డిపాజిట్లపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ తాజా ప్రతిపాదన డిపాజిటర్లకు భారీ ఊరట.
బ్యాంకులు దివాలా తీస్తే...
బ్యాంకులు దివాళా తీస్తే డిపాజిటర్లకు రక్షణ కల్పించే ప్రతిపాదనను కేంద్ర బడ్జెట్లో తీసుకు రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. కస్టమర్లు నిర్ణీత కాలంలో తమ డిపాజిట్స్ పొందవచ్చునని నిర్మలమ్మ హామీ ఇచ్చారు. బ్యాంకు లిక్విడేట్ అయినప్పటికీ డిపాజిటర్లు తమ డిపాజిట్లను సులువుగా, టైమ్లైన్లో పొందేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ యాక్ట్ (DICGC యాక్ట్) 1961ను సవరిస్తారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
వేచి చూడాల్సి వచ్చేది
అనుకోని పరిస్థితుల్లో డిపాజిటర్లకు ఏదైనా బ్యాంకు నగదును చెల్లించడంలో విఫలమైతే ఆర్బీఐకి చెందిన DICGC డిపాజిటర్లకు సంబంధిత బీమాను అందిస్తుంది. పీఎంసీ, యస్ బ్యాంకు ప్రభావం నేపథ్యంలో డిపాజిట్ బీమా మొత్తాన్ని రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచారు. బ్యాంకు లైసెన్స్ రద్దు, సమ్మేళనం లేదా విలీనం లేదా పునర్నిర్మాణ పథకం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి రూ.5 లక్షల బీమాలోనే అసలు, వడ్డీ కలిపి ఇస్తారు. ఈ నేపథ్యంలో బ్యాంకులో సంక్షోభం ఏర్పడినప్పుడు, బ్యాంకులు దివాళా తీసినప్పుడు డిపాజిటర్లు తమ డబ్బులు తిరిగి పొందటానికి చాలాకాలం వేచి చూడాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం డిపాజిటర్లకు ఎంతో ఊరట. DICGC 1961 సవరణతో డిపాజిటర్లకు కష్టాలు తొలగనున్నాయి.
నిర్దేశించిన సమయంలో
నిర్దేశించిన కాలంలో డిపాజిటర్లు తమ బీమాను పొందవచ్చు. డిపాజిటర్లకు ఇది ఎంతో ఊరట కలిగించే విషయం. ఖాతాలు స్తంభింపజేసిన కస్టమర్లు కూడా బీమా పరిమితి వరకు నిధులను పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు లేదా డిపాజిట్ల ఉపసంహరణపై పరిమితి విధించినప్పుడు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మలమ్మ తాజా హామీతో కస్టమర్ల డిపాజిట్లకు రక్షణ లభిస్తుందని అంటున్నారు.