ICICI Q2 results: రూ.వేల కోట్ల నెట్ ప్రాఫిట్
ముంబై: ప్రైవేట్ సెక్టార్లో అతి పెద్ద బ్యాంక్గా ఉంటోన్న ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ).. తన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు మించిన స్థాయి రాణించిందీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 30 శాతం వరకు పైగా నెట్ ప్రాఫిట్ను నమోదు చేసింది.
రూ.5,511 కోట్ల ప్రాఫిట్..
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ 30 శాతం మేర నెట్ ప్రాఫిట్ను పెంచుకోగలిగింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో 5,511 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ను అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చుకుంటే.. నెట్ ప్రాఫిట్ మరింత మెరుగుపడింది. 2020-2021 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 4,616 కోట్ల రూపాయలు కాగా.. ఈ ఏడాది అదే కాలానికి 5,511 కోట్ల రూపాయల ప్రాఫిట్ను రికార్డు చేసింది.
అంచనాలకు మించి..
ఐసీఐసీఐ బ్యాంక్ నమోదు చేసే నెట్ ప్రాఫిట్ 5,441 కోట్ల రూపాయలుగా ఉండొచ్చంటూ మొదట్లో అంచనాలు వ్యక్తమయ్యాయి. వాటిని తలకిందులు అయ్యాయి. ఏ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోల్చుకున్నప్పటికీ.. ఈ నెట్ ప్రాఫిట్ అధికం. కాగా నెట్ ఇంటరెస్ట్ ఇన్కమ్ కూడా 25 శాతం పెరిగింది. 11,690 కోట్ల రూపాయలకు చేరింది. నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ సైతం మెరుగుపడింది. గత ఏడాది ఇదే రెండో త్రైమాసికానికి నమోదైన నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 3.89, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3.57 ఉండగా.. ఈ సారి నాలుగు శాతానికి చేరింది.
17 శాతం పెరిగిన డిపాజిట్లు..
ఐసీఐసీఐ బ్యాంక్కు దేశవ్యాప్తంగా 5,277 శాఖా కార్యాలయాలు ఉన్నాయి. వాటన్నింట్లోనూ డిపాజిట్లు భారీగా పెరిగినట్లు యాజమాన్యం తెలిపింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ దఫా 17 శాతం మేర డిపాజిట్లు పెరిగినట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ముగిసే సమయానికి మొత్తం డిపాజిట్లు 9.77 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. అడ్వాన్సుల చెల్లింపు 7.64 లక్షల కోట్లుగా ఉందని పేర్కొంది. కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) డిపాజిట్లు 28 నుంచి 44 శాతానికి పెరిగినట్లు వివరించింది.
ఎన్పీఏలో క్షీణత
బ్యాంకు ఆధీనంలో ఉన్న నిరర్థక ఆస్తుల (నాన్ పెర్మార్మింగ్ అసెట్స్-ఎన్పీఏ) విలువ 12 శాతం మేర అంటే 8,161 కోట్ల రూపాయలు తగ్గిందని పేర్కొంది. నిరర్ధక ఆస్తులను తగ్గించుకోవడానికే అన్ని బ్యాంకులు ప్రాధాన్యతను ఇస్తుంటాయి. 2014 తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ ఆధీనంలో ఉన్న ఈ ఆస్తులు తగ్గడం ఇదే తొలిసారి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎన్పీఏ విలువ 9,306 కోట్ల రూపాయల మేర ఉండగా.. రెండో త్రైమాసికానికి అది తగ్గింది. 8,161 కోట్లకు చేరింది. రైటాఫ్స్ పోను రికవరీలు, అప్గ్రేడ్స్ కలిపి 5,482 కోట్ల రూపాయల మేర పెరిగిందని బ్యాంక్ తెలిపింది. ఇదివరకు ఈ మొత్తం 3,627 కోట్ల రూపాయల వరకు ఉండేది.