ఫస్ట్ డే 200 కార్ల ఉత్పత్తి, పెరుబందూర్ హ్యుండాయ్ ప్లాంట్ నుంచి.. భౌతిక దూరం పాటిస్తూ...
కరోనా వైరస్ వల్ల గత 45 రోజుల నుంచి పరిశ్రమలు మూతబడిన సంగతి తెలిసిందే. జోన్లవారీగా విభజించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలను అనుమతి ఇచ్చింది, దీంతో చెన్నైలో హ్యుండాయ్ కంపెనీ తమ కార్ల ఉత్పత్తిని శుక్రవారం ప్రారంభించింది. చాలా రోజుల తర్వాత ప్లాంట్ నుంచి 200 కార్లు బయటకొచ్చాయని కంపెనీ ప్రకటించింది.
శ్రీ పెరుబందూరులో గల హ్యుండాయ్ కంపెనీలో ఉత్పత్తిని నిన్న ప్రారంభించారు. ప్లాంట్లో పనిచేస్తోన్న సిబ్బంది కరోనా వైరస్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని కంపెనీ పేర్కొన్నది. సామాజిక దూరం పాటిస్తూ.. మాస్క్లు వేసుకొని కార్ల ఉత్పత్తి చేశారని పేర్కొన్నది.
ఆర్థిక వ్యవస్థను తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చేందుకు కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను యథాస్థితికి తీసుకొచ్చేందుకు అనేక పరిశ్రమలకు దశలవారీగా అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరుబందూరులోని హ్యుండాయ్ ప్లాంట్లో కార్ల ఉత్పత్తిని ప్రారంభించారు.