కరెన్సీపై లక్ష్మీదేవి చిత్రం ఉంటే.. రూపాయి బలపడుతుందా?: స్వామి ఏమన్నారు?
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మధ్యప్రదేశ్లోని ఖాంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట చేసిన ప్రసంగాల్లో భాగంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఇండోనేసియా కరెన్సీ మీద గణపతి చిత్రం ఉండే విషయాన్ని ఒకరు ప్రస్తావిస్తూ, ప్రశ్నించారు. దీనిపై సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు.
లక్ష్మీదేవి చిత్రం ఉంటే బాగు...
ఇండోనేషియా కరెన్సీ పైన గణేషుడి చిత్రం ఉంటుందని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. 'ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు. నేను దీనికి సానుకూలంగానే ఉన్నాను. గణేషుడు అడ్డంకులను తొలగిస్తారు. కరెన్సీపై (భారత) లక్ష్మీదేవి చిత్రం ఉంటే భారత కరెన్సీ పరిస్థితిని మెరుగుపరుస్తుందని నేను భావిస్తున్నాను. దీని గురించి ఎవరూ బాధపడరని భావిస్తున్నాను' అని స్వామి పేర్కొన్నారు.
రూపాయి వ్యాల్యూ...
డాలరుతో రూపాయి మారకం విలువ గత ఏడాది చివరలో 72 పైసలు కూడా దాటిన సందర్భం ఉంది. తాజాగా బుధవారం 70.82 వద్ద నిలిచింది. అంతకుముందు మంగళవారం 70.87 వద్ద క్లోజ్ అయింది. ఇటీవల రూపాయి కాస్త బలపడుతోంది. రూ.70 నుంచి రూ.72 మధ్య తచ్చాడుతోంది.
సీఏఏపై సుబ్రహ్మణ్య స్వామి...
పౌరసత్వ చట్ట సవరణ అంశంపై కూడా స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ కూడా దీని కోసం విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా 2003లో CAA కోసం విన్నవించుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిందన్నారు. కానీ ఇప్పుడు ఆందోళనలు దారుణమని అభిప్రాయపడ్డారు.