ఈ రైతులు నిజంగానే మహారాజులు... వారి ఆదాయం రూ 25 కోట్లు!
రైతే రాజు అని ఒకప్పుడు అనేవారు. కానీ కొన్నేళ్లుగా ఇండియాలో వ్యవసాయం చేసేవారికి పుట్టెడు కష్టాలు. ఆరుగాలం కష్టపడ్డా... తుపానులో, వరదలో వచ్చి పంటలను నాశనం చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అతి వృష్టి... మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి. అదృష్టం కలిసి వచ్చి పంట చేతికి వచ్చినా... మార్కెట్లో తగిన ధర లభించదు. వెరసి వ్యవసాయం అంటేనే దండగ అనే అభిప్రాయం ఏర్పడింది. ఒకవైపు అప్పులు, మరోవైపు తిప్పలు పడే రైతులు వారి పిల్లలను వ్యవసాయం వద్దంటూ పట్నాలకు పంపించి ఏదో ఒక ఉద్యోగం చూసుకొమ్మని చెబుతున్నారు. ఈ కష్టం పగవారికి కూడా రావొద్దురా బాబూ అని బాధపడే రైతులు ఎందరో. కానీ.... మన దేశంలోనే ఒక ప్రాంతంలో ఒక రైతు కుటుంబం మాత్రం వ్యవసాయాన్ని పండగలా చేస్తోంది. కేవలం ఒక పంట ఆ కుటుంబానికి రూ 25 కోట్ల రాబడి తెచ్చి పెడుతోంది. అది కూడా ప్రతి సంవత్సరం. అంత సంపాదన ఉన్నప్పుడు... ఆ రైతును 'రాజు' అని అనకుండా ఎలా ఉండగలం? ఆ రైతులు ఎవరో, వారి విజయ గాథ ఏమిటో తెలుసుకోవాలంటే ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక కథనంలోకి తొంగి చూడాల్సిందే. మీ కోసం ఆ వివరాలు.
తలరాత మార్చిన బంగారు పంట...
గుజరాత్ లోని అరవాలి జిల్లా దొరపూర్ కంపా అనే గ్రామంలోని రైతుల తలరాత మార్చింది ఒక 'లేడీ రోసెట్టా' (ఎల్ఆర్) అనే పొటాటో (బంగాళాదుంప) పంట. దీనిని చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తినే పొటాటో చిప్స్, వాఫెర్స్ తయారు చేసేందుకు వాడుతారు. వీటిని తయారు చేసే ఐటీసీ, బాలాజీ ఫుడ్స్ వంటి కంపెనీలు మంచి ధర చెల్లించి ఈ పంటను కొనుగోలు చేస్తాయి. ఎంఎస్సి అగ్రికల్చర్ చదువుకున్న జితేష్ పటేల్ అనే వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో వారి తలరాత పూర్తిగా మారిపోయింది. 26 ఏళ్లుగా జితేష్ ఫామిలీ పొటాటో పండిస్తున్నా .. 2007 లో ఆయన ఎల్ఆర్ వెరైటీ పొటాటో పండించేంత వరకు వారికి నామమాత్రపు ఆదాయమే వచ్చేది. కానీ 2007 లో ఒక 10 ఎకరాల్లో ఎల్ఆర్ పొటాటో పండించటం... దిగుబడి మెరుగ్గా రావటం, ఆ తర్వాత పంటకు అధిక స్థాయిలో గిట్టుబాటు ధర లభించటంతో ఇక వారు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.
1,000 ఎకరాలు.. 20 వేల టన్నులు..
దిగుబడి, రాబడి ఆశాజనకంగా ఉండటంతో జితేష్ పటేల్ తన కుటుంబ సభ్యులందరి చేతా అదే పంట వేయించారు. దీంతో ప్రస్తుతం వారంతా కలిసి 1,000 ఎకరాల్లో ఎల్ఆర్ పొటాటో పండిస్తున్నారు. ఏటా సుమారు 20,000 టన్నుల దిగుబడి వస్తోంది. దీంతో వారికి సాలీనా రూ 25 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా జితేష్ పటేల్ ది టైమ్స్ ఆఫ్ ఇండియా కు తెలిపారు. ఇటీవల గాంధీనగర్ లో జరిగిన గ్లోబల్ పొటాటో కాంక్లేవ్ - 2020 లో పాల్గొన్న అయన ఈ ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు.
లక్ష టన్నుల ఎగుమతి..
ఈ పంటకు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దాంతో ఒక్క గుజరాత్ నుంచే గతేడాది సుమారు 1,00,000 టన్నుల ఎల్ఆర్ పొటాటో వివిధ దేశాలకు ఎగుమతి అయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియా, కువైట్, ఒమాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు ఇండియా నుంచి అధిక మొత్తంలో ఈ పొటాటోలను దిగుమతి చేసుకుంటున్నాయి. చిప్స్, వాఫెర్స్ తయారు చేసే కంపెనీలు ఈ పంటను కచ్చితమైన, ముందస్తుగా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తాయి. అలాగే ఈ పంట ఎల్లప్పుడూ నిలకడగా వారికి లభించేలా ఏర్పాట్లు చేసుకుంటాయి. అందుకే రైతులతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఒక్కో కిలో ఎల్ఎఆర్ రకం పొటాటో ధర కనీసం రూ 17 పలుకుతుందన్న మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైతులు తీసుకున్న ఒక సరైన నిర్ణయం వారిని కోటీశ్వరులను చేసింది. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది రైతులు కూడా మార్కెట్లో అధిక డిమాండ్ ఉండే కొత్త తరహా పంటలు పండించి లాభాలు గడించాలని కోరుకుందాం. జై కిసాన్.