ఐపీఓ జాబితాలో ఓయో: ఇన్వెస్టర్ల నమ్మకం పైనే: కరోనా కాలంలో
ముంబై: దేశీయ హాస్పిటాలిటీ సెక్టార్లో టాప్ ప్లేస్లో కొనసాగుతోన్న ఓయో సంస్థ.. పబ్లిక్ ఇష్యూకు రానుంది. దీనికి సంబంధించిన సన్నాహకాలను మొదలు పెట్టింది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ జారీ చేయడానికి సన్నద్ధం కావాలంటూ ఓయో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సూచించినట్లు ఆ కంపెనీ ముఖ్య ఆర్థిక వ్యవహారాల అధికారి అభిషేక్ గుప్తా తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఐపీఓను జారీ చేయడానికి ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేవంటూ కంపెనీ ఆడిట్ కమిటీ నివేదక ఇచ్చిందని, దీనికి అనుగుణంగా తమ కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓయో రూమ్స్ పూర్తి స్థాయిలో భర్తీ కావట్లేదు. లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఓయో రూమ్లను అద్దెకు తీసుకునే వారి సంఖ్య క్షీణించింది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఆరంభం కావడంతో ఓయో అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది.
ఇక థర్డ్వేవ్ ముప్పు కూడా తప్పకపోవచ్చంటూ నిపుణుల నుంచి హెచ్చరికలు జారీ అవుతోన్నాయి. ఈ పరిణామాల మధ్య పబ్లిక్ ఇష్యూను జారీ చేయాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయించారు. దేశీయ స్టాక్ మార్కెట్లో పలు కొత్త కంపెనీలు, స్టార్టప్లు ఐపీఓలను జారీ చేస్తూ వస్తోన్నాయి. ఆన్లైన్ ద్వారా వినియోగదారుల నుంచి బుకింగ్లను స్వీకరించే దాదాపు అన్ని సంస్థలు ఐపీఓల సెక్టార్లో ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పటికే పేటీఎం ఐపీఓను ఇష్యూ చేసింది. జొమోటో ఐపీఓను జారీ చేసింది. ఆన్లైన్ కార్ల బుకింగ్ కంపెనీల ఓలా ఈ జాబితాలో ఉంది.
అదే క్రమంలో హాస్పిటాలిటీ సెక్టార్కు చెందిన ఐపీఓకు సిద్దపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో అడుగు పెట్టే అవకాశాలు లేకపోలేదని సీఎఫ్ఓ అభిషేక్ గుప్తా చెప్పుకొచ్చారు. కోవిడ్ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోన్నామని, రెండు వారాలుగా వ్యాపార లావాదేవీలు భారీగా పెరిగాయని అన్నారు. ఐపీఓను జారీ చేసే క్రమంలో తొలుత ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుందని, ఈ దిశగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారని చెప్పారు.