రూ.100 వరకు ఉల్లి ధర: లక్ష టన్నులు దిగుమతి చేసుకోవాలని నిర్ణయం
న్యూఢిల్లీ: ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధరలు తగ్గించే చర్యలు చేపట్టింది. కొన్ని రిటైల్ మార్కెట్లో కిలో రూ.100 వరకు పెరిగింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక లక్ష టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
రూ.100 వరకు ఉల్లి ధర
కార్యదర్శుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో కిలో ఉల్లి ధర దాదాపు రూ.100 పలుకుతోంది. ఇతర నగరాలు, పట్టణాల్లో రూ.60-80గా ఉంది. ఈ నేపథ్యంలో ధరల నియంత్రణ కోసం మార్కెట్కు ఉల్లి సరఫరాను పెంచాలని కేంద్రం యోచిస్తోంది. అందుకు దిగుమతులపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ ఎంఎంటీసీ ఉల్లిని దిగుమతి చేసుకోనుండగా, సహకార సంస్థ నాఫెడ్ దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంది.
లక్ష టన్నుల ఉల్లి దిగుమతికి నిర్ణయం
దేశంలో భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేసేందుకు లక్ష టన్నుల ఉల్లిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు పాశ్వాన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ నెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు మార్కెట్లో ఉల్లి సరఫరా పెరిగేలా దిగుమతులకు సిద్ధం కావాలని ఎంఎంటీసీని ప్రభుత్వం ఆదేశించింది.
40 శాతం వరకు పడిపోయిన పంట
ఈజిప్ట్, ఇరాన్, టర్కీ, ఆఫ్గనిస్తాన్ దేశాల నుంచి ప్రయివేటు టెండర్ల ద్వారా ఉల్లిని దిగుమతి చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఉల్లి ఉత్పత్తి 30 శాతం నుంచి 40 శాతం వరకు పడిపోయింది. దీంతో దేశంలో ధరలు భగ్గుమన్నాయి. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలు కూడా ఉల్లి పంటను దెబ్బతీశాయి.
15 రోజుల్లో 120 శాతం పెరిగిన ఉల్లి ధర
నాసిక్ జిల్లాలోని లాసాల్గావ్ మార్కెట్లో పదిహేను రోజుల్లోనే ఉల్లి హోల్ సేల్ ధరలు ఏకంగా 120 శాతం పెరిగాయి. అక్టోబర్ 19వ తేదీన రూ.25 ఉన్న ధర నవంబర్ 4వ తేదీకి రూ.55కు పెరిగింది.