అందరికీ ఒకే పన్నుమేలు, జీఎస్టీ 10% ఉంటేచాలు: నిపుణుల మాట!
ప్రస్తుతం అందరి ద్రుష్టి కేంద్ర బడ్జెట్ పైనే ఉంది. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ పై ఎవరి అంచనాలు వారికున్నాయి. వ్యక్తిగత ఆదయ పన్ను రేటు తగ్గించాలని కొందరు, కార్పొరేట్ పన్నులు మరింత తగ్గించాలని ఇంకొందరు విన్నపాలు చేస్తున్నారు. అయితే, ఆర్థిక నిపుణులు మాత్రం ... ప్రస్తుతం మందగమనంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి జీఎస్టీ ని సరళీకరించాలని సూచిస్తున్నారు. ఒకే దేశం ... ఒకే పన్ను అంటూ హడావిడిగా, అనాలోచితంగా దేశం మీద రుద్దిన ఈ పన్ను తో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నది అన్ని వర్గాల అభిప్రాయం. రకరకాల పన్ను స్లాబులు, సంక్లిష్టమైన ఇన్పుట్ క్రెడిట్ అంశాలు దీనిని మరింత జఠిలం చేశాయి.
సాఫ్ట్ వేర్ లో లోపాలు, పన్ను చెల్లింపు విధానంలో ఉన్న లోపాలను కొందరు ఉద్దేశపూరిత పన్ను ఎగవేతదారులు వారికి అనుకూలంగా మార్చుకున్నారు. రూ కోట్లలో పన్నులు ఎగవేస్తున్నారు. వారిని వెతికి పట్టుకుని శిక్షించే యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదనే చెప్పాలి. రెండేళ్ల క్రితం ఈ పన్నును అమల్లోకి తీసుకొచ్చే సందర్భంలో ప్రభుత్వ రాబడి భారీగా పెరుగుతుందని, అదే సమయంలో ప్రజలపై పరోక్ష పన్నుల భారం తగ్గుతుందని, ఎగవేతలు పూర్తిగా కనుమరుగు అవుతాయని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ దానికి పూర్తి విరుద్ధంగా అందులో ఏ ఒక్క లక్ష్యం కూడా నెరవేరిన దాఖలా లేదు. పన్ను వసూళ్లు నానాటికీ తీసికట్టుగా మారి, నెలకు రూ 1,00,000 కోట్లు రావటమే గగనమై పోయింది.
మీ సిద్ధాంతాలు పక్కనపెట్టండి.. ఇది సహించకూడదు: ఆనంద్
10% జీఎస్టీ...
అనేక స్లాబులతో, అధిక పన్ను రేటుతో సంక్లిష్టంగా ఉన్న జీఎస్టీ ని సమూలంగా మార్చాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అందరికీ ఒకే పన్ను రేటు... అది కూడా కేవలం 10% జీఎస్టీ అమలు చేస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.
అందులో కేంద్ర మాజీ ఫైనాన్స్ సెక్రటరీ విజయ్ కేల్కర్ వ్యాఖ్యలను ప్రస్తావించింది. విజయ్ కేల్కర్ స్వయానా జీఎస్టీ ఆర్కిటెక్ట్ కావటం గమనార్హం. అయన మరో ప్రముఖ ఆర్థికవేత్త అజయ్ షా తో కలిసి రాసిన పుస్తకంలో 10% జీఎస్టీ పన్ను రేటును ప్రతిపాదించారు. 'ఇన్ ది సర్వీస్ ఆఫ్ ది రిపబ్లిక్: ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ది ఎకనామిక్ పాలసీ' అనే పేరుతో 2019లో ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఎకానమీ లో ని 70% రంగాలకు 10% సింగల్ జీఎస్టీ పన్ను రేటును వర్తింపజేసినా... జీడీపీ లో 7% నికి సమానమైన పన్ను వసూళ్లు ఉంటాయి అని కేల్కర్ పేర్కొన్నారు.
రేటింగ్ అవసరం...
ఇండివిడ్యుల్స్ కోసం ఎలాగైతే క్రెడిట్ రేటింగ్ వ్యవస్థ (సిబిల్) ఉందొ... జీఎస్టీ చెల్లింపుదారులకు కూడా అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ నిపుణులు సూచిస్తున్నారు. ఈ రేటింగ్ ఆధారంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేయవచ్చు, ప్రభుత్వం తమ పథకాలను అమలు చేయవచ్చు. గుడ్ రేటింగ్ ఉన్న వారికే అన్ని పథకాలు వర్తిస్తాయి.
రుణాలు లభిస్తాయి. బ్యాడ్ రేటింగ్ ఉంటె అంతే సంగతులు అన్న విధంగా నిబంధనలు రూపొందిస్తే ఎగవేతదారులు చాలా వరకు తగ్గుతారని అభిప్రాయపడుతున్నారు. లేదంటే సిస్టం లో ఉండే ప్రతి చిన్నలోపాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రభుత్వంతో, అధికారులతో ఆటలాడే వారు మరింతగా రెచ్చిపోతారని సందేహిస్తున్నారు. అధికారిక అంచనాల ప్రకారమే ఈ ఏడాది ఆరు నెలల కాలంలో రూ 45,000 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతలను గుర్తించారు. అంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందొ ఊహించుకోవచ్చు.
పెట్రోలు కూడా...
ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేని పెట్రోలు, డీజిల్ వంటి ఉట్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే జీఎస్టీ కి నిజమైన అర్థం ఉంటుందని చెబుతున్నారు. ఇన్పుట్ క్రెడిట్ అంశాల్లో కూడా విపరీతమైన సంక్లిష్టత నెలకొందని, అది తొలగిపోవాలని కోరారు. అదే సమయంలో పన్నులు సకాలంలో చెల్లించే వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, వారికి సంబంధించిన కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలని, ప్రభుత్వ పథకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు.
ప్రభుత్వం కూడా తన సాఫ్ట్ వేర్ ను అధునాతన టెక్నాలజీ ఐన ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మేళవింపుతో పటిష్టం చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే దేశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.