RBI గవర్నర్గా శక్తికాంతదాస్ పొడిగింపు, ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ 10వ తేదీతో ఆయన మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో 2018లో శక్తికాంతదాస్ గవర్నర్ బాధ్యతలు చేపట్టగా, ఆయన పదవీకాలం డిసెంబర్ నెలలో ముగుస్తోంది. కానీ సంక్షోభంలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని మూడేళ్ల పాటు పొడిగించింది. అంటే 2024 వరకు ఆయన కొనసాగనున్నారు. ఆర్థికం, పన్నుల విధానం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగం ఇలా అన్నింట్లోనూ ఆయన సుదీర్ఘకాలం పని చేసినందున.. ఆయననే మళ్లీ రిజర్వుబ్యాంక్ గవర్నర్గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.
అంతకుముందు...
2021 డిసెంబర్ 10వ తేదీ నుండి ఆయన పునర్నియామకం అమలులోకి వస్తుంది. ఈ మేరకు మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఆపాయింట్మెంట్ కమిటీ తెలిపింది. ఇది వరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు శక్తికాంతదాస్. దాస్ 2018 డిసెంబర్ 12వ తేదీన ఆర్బీఐ 25వ గవర్నర్గా బాధ్యతలను చేపట్టారు. దాస్ పదవీకాలం ముగియడానికి దాదాపు నెల రోజుల ముందే ఈ నిర్ణయం తీసుకున్నది. ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన 15వ ఆర్థిక సంఘం తాత్కాలిక సభ్యుడిగా పని చేశారు. 38 సంవత్సరాల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆయన వేర్వేరు హోదాల్లో సేవలు అందించారు. ఆర్థిక శాఖపై ఆయనకు పట్టు ఉంది. కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 8 బడ్జెట్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఆయన పర్యవేక్షణలో రూపుదిద్దుకున్నాయి.
నోట్ల రద్దు సమయంలో..
ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్, న్యూడెవలప్మెంట్ బ్యాంక్, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెన్టిమెంట్ బ్యాంక్లకు ఆయన ఆల్టర్నేటివ్ గవర్నర్గా పని చేశారు. ఇంటర్నేషనల్ మనీ ఫండ్, జీ20, బ్రిక్స్, సార్క్ వంటి అత్యున్నత వేదికలకు భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. 1980వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి శక్తికాంతదాస్. కేంద్ర రెవెన్యూ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగాలలో కార్యదర్శిగా పని చేశారు. 2016లో నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.
అందుకే పొడిగింపు
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిని వ్యవస్థలో ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడింది. ఈ సమయంలో దాస్ నేతృత్వంలోని ఆర్బీఐ రంగంలోకి దిగి సమస్యలను పరిష్కరించేందుకు అనేక చర్యలు చేపట్టింది. వడ్డీరేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించారు. ప్రభుత్వ ఉద్దీపనలతో పాటు ఆర్బీఐ తరఫున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా లోన్ మారటోరియం మంచి ఫలితాలు ఇచ్చింది. దీనిని రూపొందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి ప్రత్యేక మినహాయింపులు ప్రకటించారు. చిన్న వ్యాపారులకు కూడా బ్యాంకులు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగారు. ఆర్బీఐ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగి ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చేందుకు ఆర్బీఐ గవర్నర్ ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగాలి. అందుకే శక్తికాంతదాస్ పదవీ కాలాన్ని పొడిగించి ఉంటారని భావిస్తున్నారు. FY22లో భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతంగా ఉండవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది.