ఏప్రిల్ 15వ తేదీ నుండి విమాన టిక్కెట్లు బుకింగ్, ఎయిరిండియా దూరం
ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు మూడు వారాల లాక్ డౌన్కు పిలుపునిచ్చారు. మరో ఎనిమిది రోజులు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుందా.. ఆగిపోతుందా అనే చర్చ సాగుతోంది. కానీ కేంద్రం కొన్ని సూచనలు, కఠిన నిర్ణయాలతో లాక్ డౌన్ను ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే విమానయాన రంగానికి కొంతలో కొంత ఊరట దక్కనుంది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు ఏప్రిల్ 15వ తేదీ నుండి టిక్కెట్లు ఇస్తున్నాయి. దశలవారీగా విమాన సర్వీసులకు వెసులుబాటు కల్పించే అవకాశముంది.
ట్రంప్ లాక్డౌన్కు ఎందుకు దూరం జరిగారు, రెండు కారణాలివే!
21 రోజుల పాటు లాక్ డౌన్ ముగిసిన తర్వాత దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను ప్రభుత్వం దశలవారీగా అనుమతించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 14వ తేదీ తర్వాత ప్రయాణీకులకు టిక్కెట్లను బుక్ చేసుకునే స్వేచ్ఛ విమాయాన సంస్థలకు ఉందంటున్నారు. లాక్ డౌన్ పొడిగిస్తే మాత్రం ఆ మేర టిక్కెట్లు రద్దు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎయిరిండియా మినహా మిగతా విమానయాన సంస్థలు ఈ నెల 14న తర్వాత విమాన ప్రయాణాలకు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఎయిరిండియా మాత్రం ఈ నెల 30వ తేదీ తర్వాత తేదీలకే టిక్కెట్లు ఇస్తోంది.
తొలుత అంతర్జాతీయ విమానాలు, ఆ తర్వాత దేశీయ విమానాలు నిలిచిపోయాయి. కరోనా కారణంగా ఎక్కువగా దెబ్బపడింది విమానయాన రంగం, పర్యాటక రంగాల పైనే. వంద శాతం మూలనపడి, ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. దీంతో వివిధ విమానయాన సంస్థలు ఉద్యోగుల వేతనాలు కట్ చేస్తున్నాయి.