ఉద్యోగులకు గూగుల్ బంపర్ ఆఫర్- ఇకపై శుక్రవారం కూడా వీక్లీ ఆఫ్...
కరోనా మహమ్మారి ప్రభావం మొదలయ్యాక ఉద్యోగులను ఎలా తప్పించాలా, వారి జీతాల్లో ఎలా కోతలు విధించాలా అని ఎదురుచూస్తున్న సంస్ధలను చూస్తూనే ఉన్నాం. భారత్ వంటి దేశాల్లో ఇలాంటి సంస్ధలపై ఉద్యోగులు చేస్తున్న న్యాయపోరాటం కూడా చూస్తున్నాం. కానీ అదే కరోనా మహమ్మారితో కుదేలవుతున్న అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగుల యోగ క్షేమాల గురించి టెక్ సంస్ధల ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తీసుకున్న నిర్ణయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. కరోనా కారణంగా ఉద్యోగులపై పడుతున్న భారం దృష్ట్యా ఇప్పటికే రెండు రోజులుగా ఉన్న వీక్లీ ఆఫ్ను మరో రోజుకు గూగుల్ పెంచింది.
ఆటోమొబైల్ పరిశ్రమకు త్వరలో గుడ్న్యూస్
ఉద్యోగులపై కరోనా ఒత్తిడి..
కరోనా ప్రభావం మొదలయ్యాక టెక్ సంస్ధలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కే అవకాశం కల్పిస్తున్నాయి. ఐటీ సంస్ధలకు ఎప్పటి నుంచే వారాంతంలో రెండు రోజులు వీక్లీ ఆఫ్లు కూడా ఉన్నాయి. అయినా మిగిలిన ఐదు రోజుల్లో వారిపై ఉండే ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రత్యేకించి కరోనా వల్ల ఇళ్ల వద్దే ఉండి పనిచేస్తున్నా ఐటీ ఉద్యోగులకు నిద్ర కూడా కరవవుతోంది. దీనికి కారణం పెరిగిన ఒత్తిడే. కరోనా కారణంగా పని భారం పెరగడంతో ఇళ్ల వద్ద ఉండి కూడా పనిచేయలని పరిస్ధితి చాలా మంది ఉద్యోగులకు ఎదురవుతోంది. ప్రత్యేకించి అమెరికా వంటి దేశాల్లో టెక్ సంస్ధలు ఇళ్ల వద్ద నుంచి కూడా ఉద్యోగులను పని చేయించుకోవడం కష్టంగా మారుతోంది. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్లోనూ మరిన్ని తాయిలాలు ప్రకటిస్తూ ఉద్యోగులతో పనిచేయించుకునేందుకు కార్పోరేట్ సంస్దలు సిద్ధమవుతున్నాయి.
గూగుల్ సంచలన నిర్ణయం
ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండే గూగుల్ కరోనా కారణంగా తమ ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలపై తాజాగా మరోసారి దృష్టిసారించింది. ముఖ్యంగా ఐదు రోజుల పని దినాల్లోనూ తమ ఉద్యోగులు ఇళ్ల వద్దే ఉండి కూడా పని చేయలేకపోతున్నారని గూగుల్ గుర్తించింది. ఐదు రోజుల్లో చేస్తున్న పనిలోనూ కరోనా కారణంగా పెరిగిన ఒత్తిడి వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతోందని గూగుల్ దృష్టికి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఇస్తున్న రెండు వారాంతపు సెలవులను పెంచి మరో రోజు శుక్రవారం కూడా వీక్లీ ఆఫ్గా గూగుల్ ప్రకటించింది.
ఉద్యోగుల క్షేమమే ముఖ్యం..
గూగుల్ తమ ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు ఇతర కార్పోరేట్ సంస్ధలను కూడా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇందులో గూగుల్ యాజమాన్యం తమ ఉద్యోగుల ఉమ్మడి సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తమ సంస్ధలో ఇంటర్న్గా పనిచేస్తున్న వారితో పాటు శాశ్వత ఉద్యోగులకూ శుక్రవారం ప్రత్యేక వీక్లీ ఆఫ్గా ప్రకటిస్తున్నట్గు గూగుల్ తెలిపింది. అత్యవసర పరిస్ధితుల్లో ఆ రోజు ఎవరైతే పనిచేస్తారో వారు మరో రోజు సెలవు తీసుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఇలా ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ కల్పించడంలో మేనేజర్లు కూడా తమ టీమ్లకు మద్దతుగా నిలవాలని సూచించింది. దీంతో గూగుల్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
నెటిజన్ల ఫిదా...
కరోనా మహమ్మారి కారణంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని అధిగమించేందుకు గూగుల్ తీసుకున్న అదనపు వీక్లీ ఆఫ్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్పోరేట్ సంస్ధల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా కుదిపేస్తోంది. గూగుల్ నిర్ణయానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వ్యాపార ప్రయోజనాల మాట ఎలా ఉన్నా సంస్ధలకు వెన్నెముకగా ఉన్న ఉద్యోగుల సంక్షేమం కోసం గూగుల్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని, మిగతా సంస్ధలు కూడా ఇదే బాటలో సాగాలని వారు కోరుకుంటున్నారు. అయితే దీని సాధ్యాసాధ్యాలపై మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. గూగుల్ నిర్ణయం వెలువడగానే పలు సంస్ధలు అంతర్గతంగా ఇదే విషయంపై చర్చించడం మొదలుపెట్టేశాయి. అయితే ఎంత మంది దీన్ని ఫాలో ఆవుతారో చూడాల్సిందే.