income tax: పన్నుల వసూళ్లలో దేశం రికార్డు సృష్టిస్తోంది. అంచనాలకు మించి వివిధ రకాల టాక్సులు వసూలు అవుతున్నాయి. GSTతో పాటు వ్యక్తిగత ఆదాయ పన్నుల్లోనూ భారీగా వృద్ధి నమోదు అయింది. పాత పన్ను విధానంలో ఉన్న వారందరినీ కొత్త విధానానికి మార్చడానికి ఈసారి బడ్జెట్లోనూ కేంద్ర అనేక చర్యలు తీసుకుంది. తద్వారా మధ్యతరగతి ప్రజలకు కొంత వెసులుబాటుని ఇస్తూనే ఉన్నత వర్గాల గురించీ ఆలోచించింది.
2023 ఆర్థిక సంవత్సరానికి గాను 60 లక్షల మంది 30 శాతం టాక్స్ స్లాబ్ లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో ప్రకటించారు. ప్రభుత్వం చేపట్టిన టాక్స్ బేస్ విస్తరణ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇదే అత్యధిక స్లాబ్ కావడం గమనార్హం. గతేడాది 48.4 లక్షల మంది ఈ అత్యధిక స్లాబ్ లో ఉండగా.. ఇప్పుడు 60.8 లక్షలకు పెరిగినట్లు వెల్లడించారు.

పాత పన్ను విధానంలో రూ.10 లక్షలకు పైబడిన వ్యక్తులు అత్యధిక స్లాబ్ లోకి వచ్చేవారు. అయితే కొత్త విధానంలో ఈ పరిమితిని రూ.15 లక్షల పెంచారు. అయితే ప్రవాస భారతీయులు, సీనియర్ సిటిజన్లకు దీని నుంచి మినహాయింపు లభిస్తోంది. కొవిడ్ ముందున్న స్థూల పన్ను వసూళ్లు రూ.20.3 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 33 శాతం పెరుగుదల నమోదయింది. తద్వారా రూ.27.1 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

ఈ ఘనతను ఏమీ ఊరకనే చేరుకోలేదు, ఇందుకు ప్రభుత్వంలోని వివిధ విభాగాలు కలిసి తీసుకున్న పలు నిర్ణయాలు దన్నుగా నిలిచాయని పార్లమెంటులో మంత్రి ప్రస్తావించారు. ఆయా కంపెనీల బకాయిల లిస్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, పాన్-ఆధార్ లింకింగ్ వంటి చర్యలను ఉదాహరణగా వివరించారు. మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ, పన్ను బకాయిలు వాటి రికవరీ కోసం సర్కారు అనుసరిస్తున్న వ్యూహాన్ని సైతం వెల్లడించారు.


Click it and Unblock the Notifications