పెరిగిన బంగారం ధరలు, కారణమిదే: మరింతకాలం అస్థిరంగా
బంగారం ధరలు ఈరోజు(సెప్టెంబర్ 18) మళ్లీ పెరిగాయి. మొన్నటి వరకు పెరిగిన ధరలు నిన్న తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రారంభ సెషన్లో తిరిగి బలపడ్డాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి రూ.51,571 పలికింది. వెండి ఫ్యూచర్స్ కిలో 0.4 శాతం పెరిగి రూ.68,405 పలికింది. అంతకుముందు సెషన్లో బంగారం తగ్గింది. వెండి 0.7 శాతం క్షీణించింది. గత మూడు వారాలుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు రూ.56,200 పలికిన విషయం తెలిసిందే. ఆ ధరతో ఇప్పటికీ రూ.రూ.4,600 కంటే పైన తక్కువగా ఉంది.
బంగారం రూ.52,000 వద్ద ఆగిపోతుందా, మార్చి దిశగా సాగుతోందా?
బులియన్ మార్కెట్లో పసిడి..
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.53,600 దిగువన పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.49వేల పైన పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.54,650, 22 క్యారెట్ల బంగారం రూ.50,100 పలికింది. వెండి ధర రూ.67,800 పలికింది.
అంతర్జాతీయ మార్కెట్లోను పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్స్ 1,951.13 పలికింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్షీణించింది. దీంతో బంగారం ధరపై ప్రభావం పడింది. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం మేర పడిపోయింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.5 శాతం పడిపోయి ఔన్స్ 26.97 డాలర్లు, ప్లాటినమ్ 0.4 శాతం పడిపోయి 936 డాలర్లు పలికింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ ఈటీఎప్ వద్ద గోల్డ్ నిల్వల్లో మార్పు లేదు. 1247.69 టన్నులుగా ఉంది.
మరింతకాలం అస్థిరత
ఫెడరల్ రిజర్వ్ తాజా నిర్ణయాలు నేపథ్యంలో డాలర్ వ్యాల్యూ అంతకుముందు బలపడింది. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గి, ధరలు తగ్గాయి. అందరూ ఊహించినట్లుగానే ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మార్చలేదు. ఆర్థిక వ్యవస్థ దృక్పథం అనిశ్చిగా ఉంటుందని తెలిపింది. వడ్డీ రేట్లు చాలాకాలం పాటు ఇలాగే ఉండవచ్చునని తెలిపింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, కరోనా కేసులు, వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో బంగారం మరింతకాలం అస్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.