రూ.49,000 దరికి బంగారం ధరలు, అక్కడ 1950 డాలర్లు క్రాస్
బంగారం ధరలు క్రితం సెషన్లోను భారీగా పెరిగాయి. దీంతో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,000కు మరింత చేరువైంది. నిన్న (మంగళవారం) ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.277 లాభపడి రూ.48,841 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.387 లాభపడి రూ.48,971 వద్ద ముగిసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1850 డాలర్లను క్రాస్ చేసింది. బంగారం నిన్న అక్షరాలా 1852.50 డాలర్ల వద్ద ముగిసింది. నేడు ప్రారంభ సెషన్లో ఐదు డాలర్ల మేర క్షీణించింది. నేటి సెషన్లో 1,846.80 - 1,850.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి 1.17 శాతం నష్టపోయింది. కామెక్స్లో బంగారం 52 వారాల గరిష్టం 1922 డాలర్లు, కనిష్టం 1680 డాలర్లు.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.154 క్షీణించి రూ.64,112 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.114 తగ్గి రూ.64,743 వద్ద ముగిశాయి. గతవారం ఏ సమయంలో రూ.65,000 క్రాస్ చేసిన పసిడి ధరలు ఇప్పుడు రూ.64,000 స్థాయికి దిగి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.134 డాలర్లు క్షీణించి 23.762 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
బంగారం ధరలు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1830 డాలర్ల వద్ద మద్దతు కనిపిస్తోందని, అయితే దీని కిందకు పడిపోతే మరింత క్షీణించి 1780 డాలర్లకు చేరుకోవచ్చునని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,800కు పైన ఉంది. ఈ వారం ఇది రూ.49,000 క్రాస్ చేసే అవకాశాలు లేకపోలేదని, అయితే డాలర్ మారకంతో రూపాయి అంశం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అలాగే బంగారంపై దిగుమతి సుంకాన్ని కూడా తగ్గిస్తూ నిర్మలమ్మ ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు.