20 రోజుల్లో రూ.4,000 తగ్గిన బంగారం ధర, వెండి రూ.6,000 డౌన్
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతున్నాయి. గత మూడు వారాల్లోనే 10 గ్రాముల పసిడి ధరలు రూ.4,000 వరకు తగ్గాయి. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 ధరతో పోలిస్తే రూ.8,000కు పైగా తగ్గింది. క్రితం వారం వరకు వరుసగా మూడు వారాలు పసిడితో పాటు వెండి ధర కూడా క్షీణించింది. ఇక వెండి ధర రూ.65వేల నుండి రూ.59వేలకు పడిపోయింది. అంటే రూ.6వేలకు పైగా క్షీణించింది. వ్యాక్సీన్ పైన ఆశలు రోజురోజుకు పెరుగుతుండటం, ప్రకటనలు కూడా సానుకూలంగా ఉండటంతో ఈక్విటీ మార్కెట్లు పెరిగి, పసిడి మార్కెట్ డల్ అయింది.
గతవారం 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో గతవారం చివరి సెషన్లో పది గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411.00 తగ్గి రూ.48,106 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.404.00 క్షీణించి రూ.48114.00 వద్ద ముగిసింది.
కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ రూ.773.00 తగ్గి రూ.59,100 వద్ద ముగిసింది. మార్చి ఫ్యూచర్స్ రూ.1,290.00 (-2.09%) క్షీణించి రూ.60,333 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో ఔన్స్ పసిడి 1788 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్లో 1,788.10 - 1,788.10 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏడాది పసిడి ధర 19 శాతానికి పైగా తగ్గింది.
ఇక ఔన్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 22.639 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్లో 22.639 - 22.639 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో వెండి 32 శాతం మేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు 1800 డాలర్ల దిగువకు రావడం గమనార్హం.
వ్యాక్సీన్ వస్తే...
కరోనా వ్యాక్సీన్ పైన మోడర్నా, ఫైజర్ తదితర సంస్థలు చేసిన ప్రకటనలతో పసిడిపై భారం తగ్గింది. తమ వ్యాక్సీన్ 95 శాతం మేర ఫలితాలు ఇస్తోందని ఈ కంపెనీలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బంగారం భారీగా తగ్గింది. కరోనా వ్యాక్సీన్ వచ్చాక మరింత తగ్గవచ్చునని భావిస్తున్నారు. వ్యాక్సీన్ ప్రకటన వస్తే పసిడి ధర పది గ్రాములు రూ.45వేల నుండి రూ.46వేల మధ్యకు పడిపోవచ్చునని అంచనా.