భారీగా పెరిగిన బంగారం ధర: రూ.42,000 దాటి... రూ.45,000 దిశగా!
బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.4 శాతం పెరిగి రూ.41,619కు చేరుకుంది. అంతకుముందు సెషన్లో (మంగళవారం) రూ.650 పెరిగింది. ఇక, వెండి ధర కిలోకు 0.7 శాతం పెరిగి రూ.47,595 వద్ద ఉంది. బంగారం ధర కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉంది. అయితే రెండు రోజులుగా ఈ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి.
మళ్లీ రూ.42,000 దాటిన బంగారం ధర
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బుధవారం పసిడి మళ్లీ రూ.42,000 దాటింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.462 పెరిగి రూ.42,339కు చేరుకుంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో కిలో వెండి ధర ఏకంగా రూ.1,047 పెరిగి రూ.48,562కు చేరుకుంది. అంతకుముందు రోజు వెండి రూ.47,605గా ఉంది.
హైదరాబాద్లో..
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.520 పెరిగి రూ.39,650కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.520 పెరిగి రూ.42,640కి చేరుకుంది. కిలో వెండి రూ.49,900గా ఉంది.
విజయవాడ, విశాఖలలో..
విజయవాడ, విశాఖపట్నంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.520 పెరిగి రూ.39,650కి చేరుకుంది. వెండి ధర కిలో రూ.49,900గా ఉంది.
పెళ్ళిళ్ల సీజన్..
పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల అతి విలువైన లోహాల ధరలు భారీగా పెరగడంతో పసిడి ధరలు మరింత పెరిగాయని HDFC సెక్యూరిటీస్ తపన్ పటేల్ అన్నారు.
కరోనా వైరస్ ప్రభావం
కరోనా ప్రభావంతో మార్చి త్రైమాసికంలో కార్పొరేట్ సంస్థల ఆదాయాల అంచనాల్ని చేరుకునే అవకాశాలు కనిపించడం లేదని ఆపిల్ వెల్లడించింది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఇది కూడా బంగారం పెరుగుదలకు ప్రధానకారణమని చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1,606.60 డాలర్లుగా ఉంది. వెండి ఔన్స్ 18.32 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ న్యూయార్క్ మర్చంటైల్ ఎక్స్చేంజ్ - నైమెక్స్లో బంగారం ఔన్స్ ఓ దశలో 1,614.25 డాలర్లను తాకింది.
ఏడేళ్ల గరిష్టానికి.. రూ.45,000కు చేరుకోవచ్చు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఏడేళ్ల గరిష్టానికి చేరుకుంది. 1600 డాలర్ల పైకి చేరుకోవడం గమనార్హం. రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర దేశీయ మార్కెట్లో త్వరలోనే రూ45,000కు చేరుకోవచ్చునని అంటున్నారు.
ఏడాదిలో 21 శాతం పెరిగిన బంగారం ధర
కరోనా భయాలతో ప్రపంచ వృద్ధిరేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఈ పరిస్థితులను ఎదుర్కొనడానికి పలు ఆర్థిక వ్యవస్థలు ఉద్దీపన చర్యలు చేపడతాయని వార్తలు వస్తున్నాయి. ఇవి పెట్టుబడులకు స్వర్గధామంగా భావించే పసిడికి డిమాండ్ తీసుకు వస్తున్నాయి. అంతర్జాతీయంగా ఏడాదిలో బంగారం ధర 21 శాతం పెరిగింది.