సరికొత్త రికార్డ్కు బంగారం ధరలు: డాలర్ స్ట్రాంగ్, మరింత ఖరీదు
బంగారం ధరలు ఈ రోజు (మంగళవారం, ఆగస్ట్ 4) సరికొత్త రికార్డుకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి భయాలు ఇంకా వీడకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు సందిగ్ధంలో ఉన్నాయి. దీంతో పసిడిపై ఒత్తిడి పెరిగి, ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ పైన పడుతోంది. మన దేశంలో పండుగలు, పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు ఉండటంతో పసిడికి డిమాండ్ క్రమంగా పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న ధరలు కొనుగోలు నుండి వెనక్కి నెడుతున్నాయి.

ఎంసీఎక్స్లో సరికొత్త రికార్డ్
ఎంసీఎక్స్లో బంగారం ధరలు సరికొత్త రికార్డుకు చేరుకున్నాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం ఎగిసి 10 గ్రాములు రూ.53,865 పలికింది. వెండి ఫ్యూచర్ కిలో 0.18 శాతం పెరిగి రూ.65,865 పలికింది. అంతకుముందు సెషన్లో బంగారం ధరలు 0.5 శాతం (రూ.267), వెండి 1.2 శాతం (రూ.800) పెరిగింది. గత సెషన్లో ఇంట్రాడేలో పసిడి రూ.53,845 గరిష్టాన్ని తాకింది. ఈ రోజు దానిని మించింది.

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే
10 గ్రాముల 24 గ్రాముల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.54,678 పలికింది. వెండి కిలో రూ.1,672 పెరిగి రూ.66,742 పలికింది. హైదరాబాద్, విజయవాడల్లో బంగారం స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల పసిడి రూ.56,600 దాటింది. 22 క్యారెట్ల పసిడి రూ.52,000 చేరుకుంది.
ఇక, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 1,976.36 డాలర్లు పలికింది. కాస్త స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు 0.1 శాతం పడిపోయి 24.22 డాలర్లు పలికింది. ప్లాటినమ్ 0.2 శాతం ఎగిసి 918.50 పలికింది.

డాలర్ పెరిగితే.. ఇతర కరెన్సీలకు బంగారం ఖరీదు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు పెరగడం వంటి వివిధ కారణాలు బంగారంపై ప్రభావం చూపాయి. వ్యాక్సీన్ అప్పుడే రాకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే సాధారణస్థితికి చేరుకోవడానికి కూడా చాలా సమయం తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇటీవల రెండేళ్ల కనిష్టాన్ని తాకిన డాలర్ ఇప్పుడు కోలుకుంటోంది. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం ఎగిసింది. అమెరికా డాలర్ బలపడటంతో ఇతర కరెన్సీలకు బంగారం ఖరీదుగా మారుతుంది.


Click it and Unblock the Notifications