వరుసగా మూడో రోజు తగ్గిన బంగారంధరలు, ఎంత తగ్గిందంటే
బంగారం ధరలు వరుసగా మూడు రోజులుగా తగ్గుతున్నాయి. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో పసిడిపై కాస్త ఒత్తిడి ఉంది. దీంతో స్వల్పంగా మాత్రమే తగ్గాయి. ఈ రోజు ఉదయం (జూన్ 26, శుక్రవారం) ఉదయం ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధరలు 0.02 శాతం తగ్గి రూ.47,930 పలికింది. అంతకుముందు సెషన్లో 0.3 శాతం తగ్గింది. వెండి ధరలు కూడా ఈ రోజు 0.1 శాతం తగ్గి కిలో రూ.48,075 పలికింది. ఈ వారంలో అంతకుముందు బంగారం ధర రూ.48,589 రికార్డ్ హైకి చేరుకుంది.

గరిష్టం నుండి తగ్గుదల
దేశీయ, గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటం, రెండోసారి విజృంభన భయాలు తదితర కారణాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూశారు. అయితే భయాందోళనలు కొంత తగ్గడంతో ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నారు. నేడు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్ ధర 1,763.48 డాలర్లు పలికింది. ఈ వారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,779.06 డాలర్ల గరిష్టాన్ని తాకింది.

రూ.48,080 వద్ద నిరోధకస్థాయి
పెరుగుతున్న కరోనా కేసులతో దేశీయంగా బంగారం నష్టాలను పరిమితం చేస్తోంది. అలాగే ఈక్విటీ మార్కెట్ల లాభాల ప్రారంభం కూడా బంగారం డిమాండ్ను తగ్గించాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆర్థిక వృద్ధి మందగమన భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఫలితంగా ఈ వారంలో బంగారం ధర రూ.48,589 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు కాస్త ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఐఎంఎఫ్ సహా వివిధ అంచనాల ప్రతికూలత కారణంగా బంగారంపై ఒత్తిడి స్వల్ప తగ్గుదలకు మాత్రమే కారణమైంది. నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగింపు సమయానికి బంగారం ధర రూ.193 నష్టపోయి రూ.47,941 వద్ద స్థిరపడింది. బంగారానికి అప్ సైడ్లో రూ.48,080 వద్ద నిరోధస్థాయి, డౌన్ ట్రెండ్లో రూ.47,600 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉందని బులియన్ నిపుణులు అంటున్నారు.

వెండికి డిమాండ్ లేమి..
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధరలు నిన్న రూ.300 వరకు తగ్గాయి. దీంతో ధర రూ.49,072కు పరిమితమైంది. బుధవారం ఇది రూ.49,365గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర కూడా తగ్గుతోంది.


Click it and Unblock the Notifications