తగ్గిన బంగారం ధరలు, ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.7,000 డౌన్
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఆరు నెలల పాటు పెరిగిన పసిడి ధరలు, నెల రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు కూడా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) పసిడి ధరలు క్షీణించాయి. సాయంత్రం సెషన్ సమయానికి 10 గ్రాముల బంగారం 0.4 శాతం తగ్గి 49,460 పలికింది. గతవారం పసిడి రూ.2000 వరకు, వెండి రూ.9,000 వరకు క్షీణించింది. ఈ తగ్గుదల ఈ రోజు కూడా కొనసాగింది. వెండి కిలో 1 శాతం తగ్గి రూ.58,473 పలికింది. గత నెల గరిష్ట ధర నుండి వెండి రూ.7,000 తగ్గగా, వెండి రూ.20వేలకు పైగా తగ్గింది. ఇటీవల డాలర్ వ్యాల్యు క్రమంగా పెరుగుతోంది. దీంతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1860 డాలర్లు పలికింది. Fk అంతర్జాతీయ మార్కెట్లో వెండి 0.3 శాతం పడిపోయి 22.93 డాలర్లకు తగ్గింది. ప్లాటినమ్ 0.4 శాతం పెరిగి 850.74 డాలర్లు, పల్లాడియం 0.1 శాతం పెరిగి 2,217.87 డాలర్లు పలికింది.
ఈవారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు... పెరుగుతుందా, తగ్గుతుందా?
రిటైల్ కొనుగోళ్లు పెరిగే అవకాశం
నెల రోజుల క్రితం వరకు పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ధరల తగ్గుదల కోసం రిటైల్ కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు. బంగారం గరిష్టం రూ.56,200 నుండి ఇప్పుడు 50వేల దిగువకు వచ్చింది. వెండి కిలో రూ.78వేల నుండి రూ.58వేల దిగువకు వచ్చింది. ఈ నేపథ్యంలో క్రమంగా రిటైల్ కొనుగోళ్లు పెరగవచ్చునని భావిస్తున్నారు. ఓ వైపు ధరలు తగ్గడం, మరోవైపు పండుగ రావడం డిమాండ్ ఊపందుకుంటుందని జ్యువెల్లరీ మార్కెట్ కూడా భావిస్తోంది.
రాబోయే 18 నెలల్లో పసిడి ధర ఎలా ఉండవచ్చు
రాబోయే 18 నెలల్లో పసిడి ధరలు రూ.65వేల నుండి రూ.67వేలకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.47,500 నుండి రూ.48,000కు చేరుకునే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని చెబుతున్నారు. వెండి కిలో రూ.80వేలకు పెరగవచ్చునని అంటున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెట్టుబడుల వెల్లువ
కాగా, గోల్డ్ ఈటీఎఫ్లోకి వచ్చే పెట్టుబడులు గత కొంతకాలం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. పసిడి ధరల పెరుగుదలకు ఇది దోహదం చేస్తోంది. రెండో క్వార్టర్లో గోల్డ్ ఈటీఎఫ్లలోకి పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో మొత్తం పెట్టుబడులు రికార్డ్ స్థాయిలో 734 టన్నులకు చేరుకున్నాయి. అమెరికన్ డాలర్ విలువ 17% బలపడటం గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడుల పెరుగుదలకు దోహదం చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది.