భారీగా పెరిగిన బంగారం ధర, హైదరాబాద్లో రూ.58వేల కంటే పైకి..
బంగారం ధరలు ఈ రోజు (ఆగస్ట్ 7, శుక్రవారం) మళ్లీ పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.300 పెరిగి సరికొత్త రికార్డ్ రూ.56,143కు చేరుకుంది. వెండి ఫ్యూచర్స్ రూ.1,750 (2.3 శాతం) పెరిగి కిలో రూ.77,802 పలికింది. ఎంసీఎక్స్లో పసిడి రూ.56వేలు దాటడం గమనార్హం. అంతకుముందు సెషన్లో 1.3 శాతం లేదా రూ.700కు పైగా పెరిగింది. ఓ సమయంలో రూ.56,079 పలికింది. ఈ రోజు దీనిని కూడా దాటేసింది. వెండి 5.6 శాతం లేదా రూ.4,000కు పైగా పెరిగింది.
కొత్త రికార్డ్స్, భారీగా పెరిగిన బంగారం ధర, రూ.వేలల్లో వెండి జంప్
44శాతం పెరిగిన ధర..
ఈ ఏడాది మన దేశంలో బంగారం ధరలు ఏకంగా 44 శాతం పెరిగాయి. ఈ వారం బంగారం ధర రూ.55,800 మించి ఉన్నంత వరకు రూ.56,300 నుండి రూ.56,800 మధ్య ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కేసులు పెరగడం, డాలర్ వ్యాల్యూ పడిపోవడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు వంటి వివిధ కారణాలతో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్లో బంగారం ధర రెండు రోజుల్లో రూ.1000 పెరిగింది.
డాలర్ దెబ్బ.. బంగారం పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లో ఓన్స్ స్పాట్ గోల్డ్ ధర 0.3 శాతం ఎగిసి 2,068.32 డాలర్లు పలికింది. ఓ సమయంలో 2,072.50 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్స్ ఏకంగా 2.6 శాతం ఎగిసి 30 డాలర్ల సమీపానికి చేరుకుంది. 29.68 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా బలహీనమైన అమెరికా డాలర్.. బంగారం ధరలకు మద్దతు ఇచ్చింది. ఇతర కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 35 శాతం పెరిగాయి.
హైదరాబాద్లో రూ.58వేల పైపైకి..
ఈ రోజు హైదరాబాద్లో బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.500 పెరిగి రూ.53,500 పైకి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.58వేల మార్క్ దాటింది. ఢిల్లీలో 24 గ్రాముల బంగారం రూ.225 పెరిగి రూ.56,600కు చేరుకుంది.