కరోనా ఎంత పని చేసింది?: బంగారం రికార్డ్ ధరలు, మూడేళ్లు ఇంతేనా? రూ.7,000 పెరుగుదల!
గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు ఏడున్నర సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. ఈ రోజు (ఏప్రిల్ 14) ఉదయం ఔన్స్ బంగారం 1,715.25 డాలర్లు పలికింది. ఏడేళ్ల క్రితం డిసెంబర్ 12న 1,722.20 డాలర్లు పలికింది. ఆ తర్వాత ఈ స్థాయికి పెరగడం ఇదే మొదటిసారి. దాదాపు గత ఆరు నెలలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఆశ్చర్యం: అతి తక్కువ దెబ్బ చైనాకు, కరోనా కేసులు తక్కువైనా ఇండియాకే భారీ దెబ్బ
హైదరాబాద్లో ధరలు
మంగళవారం హైదరాబాద్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరిగి రూ.44,500కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.410 పెరుగుదలతో 40,840కి చేరింది. వెండి కిలో రూ.150 పెరిగింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ కారణంగా పెరుగుదల కనిపించింది.
అందుకే బంగారం బెస్ట్
కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరగడం, మరణాలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు చూస్తున్నారు. దీంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయనే భయాందోళనలు కూడా ఉన్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడి మంచిదని చాలామంది భావిస్తున్నారు.
23.74 శాతం రిటర్న్స్
బంగారం ధరలు 2019లో 23.74 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. గత క్యాలెండర్ ఇయర్లో రూ.32 వేలకు అటు ఇటుగా ఉన్న బంగారం ధర చివరి నాటికి రూ.40వేలకు చేరుకుంది. అంతకుముందు బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి దాదాపు పావు శాతం రిటర్న్స్ వచ్చాయి.
2020 నాటికి రూ.55,000
ఈ ఏడాది కూడా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి రూ.50వేలకు చేరుకుంటుందని తొలుత అంచనా వేశారు బులియన్ మార్కెట్ నిపుణులు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దీపావళి లేదా ఏడాది చివరి నాటికి రూ.55,000 కూడా చేరుకోవచ్చునని చెబుతున్నారు. మొత్తంగా రూ.50,000 నుండి రూ.55,000 మధ్య ఉంటుందని చెబుతున్నారు.
రానున్న మూడేళ్లు ఇదే
కరోనా మహమ్మారి కారణంగా ఈక్విటీ మార్కెట్లు నష్టపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితి నుండి ఆరు నెలలు లేదా ఏడాదిలోపు కుదురుకుంటుందా అంటే చెప్పలేని పరిస్థితులు అంటున్నారు. అతి తక్కువ ప్రభావం పడిందని భావిస్తున్న భారత్, చైనా దేశాలే ఆర్థికంగా కుదురుకోవడానికి ప్రస్తుత అంచనా ప్రకారమే ఏడాది పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి దాదాపు 2 లేదా 3 పడుతుందని, అంటే బంగారంపై ఇదే ఒత్తిడి కొనసాగుతుందని అంటున్నారు.
4 నెలల్లో రూ.7,000 పెరిగింది
2020 క్యాలెండర్ ఏడాదిలో బంగారం ఇప్పటి వరకు 17.31 శాతం ఎగిసింది. భారత కరెన్సీలో దాదాపు రూ.7,000 వరకు పెరిగింది. 2019 మధ్యలో హెచ్చుతగ్గులు ఉండటం వేరే విషయం. శాతాలవారీగా చూస్తే 2020 ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 16 శాతం రిటర్న్స్ అందించింది.
బంగారానికి డిమాండ్
ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా కొనుగోలు శక్తి తగ్గిందని, ఇలాంటి పరిస్థితుల్లోను బంగారం కొంతలో కొంత డిమాండ్ నిలుపుకుంటోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సేఫ్టీ సైడ్లో ఆలోచించి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
10 శాతం నుండి 30 శాతానికి
సగటు ఇండియన్ రిటైల్ ఇన్వెస్టర్ వద్ద ప్రస్తుతం తన పెట్టుబడిలో 10 శాతం నుండి 15 శాతం వరకు బంగారం ఉందని, రాబోయే రెండేళ్లలో ఈ పోర్ట్ పోలియే 30 శాతం చేరుకోవచ్చునని పీఎన్జీ జ్యువెల్లర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరబ్ గాడ్గిల్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
వెండి కొనుగోలు చేయవచ్చా అంటే..
వెండిపై పెట్టుబడి సరైన ఎంపిక కాకపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఎక్కువగా హౌస్ హోల్డ్ రిక్వైర్మెంట్స్, పూజ వంటి వాటికి ఉపయోగిస్తారు. ఆ అవసరాల మేరకు వెండిని కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.
ప్రపంచానికి బంగారమే స్థిర పెట్టుబడి
ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే రెండు మూడేళ్లలోను బంగారానికి డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచం మొత్తానికి ప్రస్తుతం బంగారం మాత్రమే స్థిరమైన పెట్టుబడి అంటున్నారు. కరోనా కారణంగా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. చమురు ధరల్లో అనిశ్చితి కనిపిస్తోంది. మ్యూచుల్ ఫండ్స్, ఫారెన్ ఇన్వెస్టర్ల నుండి అందరూ పసిడి వైపు చూస్తున్నారు. అదే సమయంలో బంగారాన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా మాత్రమే చూడాలని అంటున్నారు.