బంగారం ధరలు ఈరోజు(సెప్టెంబర్ 1, మంగళవారం) పెరిగాయి. ఎంసీఎక్స్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం ఎగిసి 10 గ్రాములు రూ.51,940 పలికింది. పసిడి ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. సిల్వర్ ఫ్యూచర్స్ ఎంసీఎక్స్లో 1.2 శాతం మేర పెరిగి కిలో రూ.71,300 పలికింది. అంతకుముందు సెషన్లో పసిడి రూ.300 పెరగగా, వెండి కిలో రూ.1800 పెరిగింది. అయినప్పటికీ ఆగస్ట్ 7వ తేదీన గరిష్ట ధర నుండి రూ.4000కు పైగా తక్కువ ఉంది.

హైదరాబాద్, విజయవాడల్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ దేశీయంగా పైకి చేరాయి. డాలర్ పతనంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆ తర్వాత ధరలు పెరగడంతో ఎంసీఎక్స్తో పాటు నగరాల్లోను ధరలు పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.55వేల సమీపానికి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 50వేలు దాటింది. విజయవాడ, హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు రూ.54,500, 22 క్యారెట్ల పసిడి రూ.49,540 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో అంతకుముందు దాదాపు మార్పులేదు. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,968.98 వద్ద స్థిరంగా కనిపించింది. ఆ తర్వాత 1988 డాలర్లకు ఎగిసింది. డాలర్ బలహీనపడటంతో స్పాట్ గోల్డ్ రెండు వారాల గరిష్టానికి చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 91.81కు పడిపోయి రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. డాలర్ వ్యాల్యూ పడిపోతే కరెన్సీ బాస్కెట్లోని ఇతర దేశాల్లో పసిడి ధర తగ్గుతుంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ ధర 0.2 శాతం పడిపోయి 28.17 డాలర్లు, ప్లాటినమ్ 0.3 శాతం పెరిగి 931.87 డాలర్లు, పల్లాడియం 0.3 శాతం తగ్గి 2,235 డాలర్లు పలికింది.

డాలర్ బలహీనపడి...
కరోనా మహమ్మారి ప్రభావంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ రికవరీకి వడ్డీరేట్ల తగ్గింపునకు ఫెడరల్ రిజర్వ్ మొగ్గుచూపడం, డాలర్ బలహీనపడటంతో పసిడికి డిమాండ్ పెరిగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్లు, ట్రేడ్ వారం, కరోనా మహమ్మారి, డాలర్ ప్రభావం సహా వివిధ అంశాలపై పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి.


Click it and Unblock the Notifications