బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే: వారంలో భారీ క్షీణత
బంగారం, వెండి ధరలు ఈవారం క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.238 క్షీణించి రూ.49,666 వద్ద స్థిరపడింది. వెండి కూడా కిలో ధర 1 శాతం మేర క్షీణించి రూ.59018 పలికింది. ఈ వారం మొత్తంలో పసిడి ధరలు మొత్తంగా రూ.2,000కు పైగా క్షీణించాయి. కిలో వెండి ధర రూ.9,000 క్షీణించింది. పుత్తడి ధరలు రూ.48,900 నుండి రూ.48,800 మధ్యకు క్షీణించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి భారీగా పడిపోయాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆగస్ట్ వరకు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. నెల పదిహేను రోజులుగా తగ్గుతున్నాయి.
ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డ్, తగ్గిన బంగారం నిల్వలు
4.6 శాతం తగ్గిన పసిడి, 15 శాతం క్షీణించిన వెండి
ఆగస్ట్ 7న బంగారం ధరలు రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆ ధరతో పోలిస్తే పుత్తడి ధరలు రూ.6.,500 వరకు తక్కువగా ఉన్నాయి. వెండి కిలో రూ.20వేలు తక్కువ పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఈ వారం 4.6 శాతం క్షీణించింది. వెండి 15 శాతం పడిపోయింది. స్పాట్ గోల్డ్ నిన్న 0.3 శాతం తగ్గి 1,861.58 డాలర్లకు పడిపోయింది. వెండి 1 శాతం తగ్గింది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ బలపడటం, అమెరికా ప్యాకేజీకి సభ్యులు ఆమోదం వంటి వివిధ కారణాలతో పసిడి ధరలు క్షీణించాయి. 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీకి అమెరికా సభ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.
పసిడి ధర ఎంత పలికిందంటే
నిన్న హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.600 వరకు పడిపోయి రూ.51,870 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.500కు పైగా తగ్గి రూ.47,550 పలికింది. వెండి కిలో రూ.2000 వరకు తగ్గి రూ.57,000 పలికింది. అయితే ఈ రోజు పసిడి రూ.500 వరకు పెరిగి రూ.52 వేల పైకి చేరుకుంది. వెండి రూ.2000కు పైగా పెరిగి రూ.59వేలు దాటింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు దయారీదారుల నుండి డిమాండ్ లేకపోవడం వంటి వివిధ కారణాలతో తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతాయి.
ఢిల్లీలో ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,800, 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ.53,190గా ఉంది. వెండి ధరలు కిలో రూ.2,300 పెరిగి రూ.59 వేలు పలికింది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు, దేశీయంగా పసిడికి డిమాండ్, స్థానిక పరిస్థితులు ఆధారంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చు.