రూ.52,000కు సమీపంలో బంగారం ధరలు, అక్కడ భారీగా పెరిగి.. మళ్లీ తగ్గుదల
డొమెస్టిక్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు బుధవారం (సెప్టెంబర్ 16) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఉదయం ప్రారంభ సెషన్లో 0.08 శాతం లాభపడిన పసిడి సాయంత్రానికి 0.27 శాతానికి పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి రూ.51,907కు చేరుకుంది. రూ.52వేలకు మరింత సమీపానికి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర సాయంత్రానికి కిలో రూ.69,930 పలికింది. అమెరికా, భారత్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు మరోసారి క్రమంగా పసిడి వైపు చూస్తున్నారు. అయినప్పటికీ పెరుగుతుందని చెప్పలేని పరిస్థితి.
బంగారం రూ.52,000 వద్ద ఆగిపోతుందా, మార్చి దిశగా సాగుతోందా?
వివిధ నగరాల్లో పసిడి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి. చెన్నైలో రూ.53,950, ముంబైలో రూ.51,580, ఢిల్లీలో రూ.54,980, కోల్కతాలో రూ.53,600, బెంగళూరులో రూ.53,560, హైదరాబాద్లో రూ.53,950, కేరళలో రూ.52,040, పుణేలో రూ.51,580, అహ్మదాబాద్లో రూ.53,970, జైపూర్లో రూ.54,980గా ఉంది.
22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధరలు.. చెన్నైలో రూ.49,450, ముంబైలో రూ.50,580, ఢిల్లీలో రూ.50,400, కోల్కతాలో రూ.50,900, బెంగళూరులో రూ.49,100, హైదరాబాద్లో రూ.49,450, కేరళలో రూ.47,700, పుణేలో రూ.50,580, అహ్మదాబాద్లో రూ.50,580, జైపూర్లో రూ.50,580గా ఉంది.
పది రోజుల్లో ధరల పెరుగుదల ఇలా...
భారత్లో గత పది రోజుల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. పుణేలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి వరుసగా సెప్టెంబర్ 7న రూ.49,590, రూ.50,590గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14వ తేదీ వరకు 22 క్యారెట్ల బంగారం రూ.49,500 నుండి రూ.50,000 దిగువన ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ.50,500 నుండి రూ.51,000 దిగువన ఉంది. రెండు రోజుల క్రితం పసిడి 22 క్యారెట్ల పసిడి రూ.50వేలు దాటింది. 24 క్యారెట్ల పసిడి రూ.51వేలు దాటింది. ఈ రోజు సాయంత్రానికి రూ.50,580(22 క్యారెట్లు), రూ.51,580 (24 క్యారెట్లు)గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ స్వల్పంగా 0.11 శాతం పెరిగి ఔన్స్ ధర 1968 పలికింది. ఓ సమయంలో పసిడి ధరలు 1979 కూడా చేరుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ స్వల్పంగా క్షీణించాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయానికి ముందు బంగారం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత నెల ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు 10 గ్రాములు రూ.56,200 పైకి చేరుకున్నాయి. రికార్డ్ గరిష్టం ధరతో పోలిస్తే ఇప్పటికీ రూ.4500 తక్కువగా ఉంది. వెండి గరిష్టం రూ.79 వేల సమీపానికి చేరుకోగా, తాజాగా ఆ ధరతో రూ.10వేల కంటే తక్కువగా ఉంది.