భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి కిలో రూ.65,000 పైన
గత సెషన్లో ఈక్విటీ మార్కెట్లు తొలుత భారీ లాభాల నుండి, స్వల్ప లాభాల్లో ముగిసిన నేపథ్యంలో ఆ ప్రభావం బంగారంపై పడింది. బంగారం ధరలు ప్రారంభ సెషన్లో స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం ఎగిసి 10 గ్రాములు రూ.51,071 పలికింది. కిలో వెండి ఫ్యూచర్స్ 0.7 శాతం ఎగిసి రూ.65,673 పలికింది. అంతకుముందు సెషన్లో పసిడి రూ.900 వరకు తగ్గగా, వెండి రూ.2500 క్షీణించింది. ఆగస్ట్ 7వ తేదీన గరిష్టస్థాయికి చేరుకున్న అనంతరం రెండు వారాల క్రితం రష్యా వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుండి పసిడి ధరలు అస్థిరంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధర పెరిగింది. నిన్న రు.400 వరకు తగ్గిన పసిడి ఈ రోజు అంతకంటే ఎక్కువ పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.400 తగ్గగా, 22 క్యారెట్ల పసిడి 300 వరకు తగ్గింది. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో దాదాపు 600 పెరిగిన 24 క్యారెట్ల పసిడి రూ.54,270కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.49,750కి చేరుకుంది. వెండి ధర కిలో రూ.65,500 వద్ద దాదాపు నిలకడగా ఉంది.
ఢిల్లీలో ధర..
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర పరుగులు పెట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.800కు పైగా పెరిగి రూ.రూ.55,200కు చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.750 పెరిగింది. కాగా, ఈ నెల 31 తేదీ నుండి ఆర్బీఐ ఆరవ అంచె సావరీన్ గోల్డ్ బాండ్స్ సబ్స్క్రిప్షన్ ప్రారంభం కానుంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,929.94 డాలర్లు పలికింది. అంతకుముందు సెషన్లో ఒక శాతానికి పైగా క్షీణించింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.1 శాతం తగ్గి ఔన్స్ 27.01 డాలర్లు, ప్లాటినమ్ 0.7 శాతం పడిపోయి 922.07 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో పసిడి ఔన్స్ ధర 2,072కు చేరుకుంది. గరిష్ట ధరతో దాదాపు 145 డాలర్లు తగ్గింది.