ఇక్కడ తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? డాలర్ దెబ్బతో అక్కడ రికార్డ్ ధర దిశగా...
గతవారం భారీగా తగ్గిన బంగారం ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. మూడు రోజులుగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,000 డాలర్ల పైకి చేరుకున్నాయి. ఈ ప్రభావం భారత మార్కెట్ పైన కూడా ఉంటుంది. నేడు ఎంసీఎక్స్లో నిలకడగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2,072 డాలర్ల గరిష్టం నుండి గతవారం 1,900 డాలర్ల దిగువకు, దేశీయ ఎంసీఎక్స్లో రూ.57వేల నుండి రూ.52వేల దిగువకు పడిపోయింది. ఈ వారం ధరలు తిరిగి పెరుగుతున్నాయి.
అక్కడ వారంలో 15,000 తగ్గింది: బంగారం ధరకు ఫుల్స్టాప్ పడిందా, ఈ వారం ఎలా ఉంటుంది?
ఎంసీఎక్స్లో పసిడి ధర
ఎంసీఎక్స్లో ఈరోజు (ఆగస్ట్ 19) అక్టోబర్ పసిడి కాంట్రాక్ట్ 10 గ్రాములు 0.5 శాతం తగ్గి రూ.53,340 పలికింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 0.8 శాతం పడిపోయి రూ.69,000 దిగువకు వచ్చింది. గత రెండు సెషన్లలో పసిడి ధర రూ.1300 తగ్గగా, వెండి రూ.2100 క్షీణించింది.
బంగారంపై డాలర్ ప్రభావం
ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ క్షీణించింది. ఈ ప్రభావం పసిడిపై పడింది. అదే సమయంలో ఇన్వెస్టర్లు యూఎస్ ఫెడరల్ రిజర్వ్స్ పాలసీపై వేచి చూసే ధోరణితో ఉన్నారు. రష్యా వ్యాక్సీన్, కరోనా కేసులు అధుపులో ఉండటంతో గతవారం పసిడిపై ఒత్తిడి తగ్గింది. ప్రస్తుతం ప్రధానంగా డాలర్, యూఎస్ ఫెడరల్ పాలసీ వైపు చూస్తున్నారు ఇన్వెస్టర్లు.
స్పాట్ గోల్డ్ ధర..
స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 2,002.12 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2,011.60 పలికింది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ వరుసగా ఆరో రోజు పడిపోయింది. 0.1 శాతం పడిపోవడంతో దాదాపు రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. ఇతర కరెన్సీలలో బంగారం ధర తగ్గుతుంది. పసిడి ధర సమీప భవిష్యత్తులో 2300 డాలర్లకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.