Gold Price Today: రూ.50,000 దిగువకు పడిపోయిన పసిడి ధర
బంగారం ధరలు నేడు (మే 18) తగ్గాయి. రెండు రోజుల క్రితం వరకు స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు, నిన్న, నేడు తగ్గుముఖం పట్టాయి. నేడు ప్రారంభ సెషన్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.265 తగ్గి రూ.49,908 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.296 తగ్గి రూ.50,027 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6300 తక్కువగా ఉంది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.492 తగ్గి రూ.60,664 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.576 తగ్గి రూ.61,320 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు రూ.60,000 దిగువకు పడిపోయిన సిల్వర్ ఫ్యూచర్స్, ఇప్పుడు కాస్త పైకి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్లో పసిడి ధరలు క్రితం సెషన్లో 1820 డాలర్ల సమీపానికి చేరుకున్నప్పటికీ నేడు 1810 డాలర్ల దిగువకు పడిపోయాయి. ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 12 డాలర్లు తగ్గి 1807 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1819 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధర దాదాపు 3 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.212 డాలర్లు తగ్గి 21.538 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 23.45 శాతం తగ్గింది.
బంగారం ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రూ.55,000 క్రాస్ చేసిన పసిడి, ఆ తర్వాత ద్రవ్యోల్భణ భయాలు వంటి కారణాలతో రూ.53,000 వద్ద ట్రేడ్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు పతనమవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా రూ.50,000 దిగువకు వచ్చాయి.