నేటి బంగారం ధరలు, ఇంకా అస్థిరంగానే: హైదరాబాద్లో ఎంతంటే?
న్యూఢిల్లీ: బంగారం ధరల పతనానికి ఈ రోజు బ్రేక్ పడింది. కరోనా మహమ్మారి భారీ ప్రభావం చూపుతుందనే అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎంసీఎక్స్లో 10 గ్రాముల పసిడి ధరలు రూ.300 పెరిగి రూ.51,200 వరకు పలికింది. కిలో వెండి ధర రూ.750 పెరిగి రూ.65,940 పలికింది. ఈ నెల 7వ తేదీన పసిడి ధర రికార్డ్స్థాయిలో పెరిగి రూ.56వేల పైకి చేరుకుంది. నాటి నుండి 10 గ్రాముల పసిడి రూ.5,000కు పైగా తగ్గింది.
'మహా' ఎఫెక్ట్, దూసుకెళ్లిన రియాల్టీ షేర్లు: 5 నెలల తర్వాత రూపాయి రికార్డ్
హైదరాబాద్లో పసిడి ధరలు
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50వేల దిగువకు వచ్చింది. ఆగస్ట్ నెలలో ఇది ఓ దశలో రూ.55వేలకు చేరుకుంది. గరిష్ట ధర కంటే రూ.5వేల కంటే ఎక్కువ తగ్గింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.550కి పైగా తగ్గి రూ.53,720 పలికింది. కిలో వెండి ధర రూ.800 వరకు పెరిగి రూ.66వేల పైకి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు పెరిగాయి. నిన్న 1 శాతం తగ్గిన బంగారం ధరలు ఈ రోజు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.4 శాతం పెరిగి 1,936.64 డాలర్లకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.6 శాతం పెరిగి ఔన్స్ 1,943.20 చేరుకుంది. వరుస పతనం అనంతరం ధరలు స్వల్పంగా పెరిగాయి. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రతికూల ప్రభావం ఉంటుందనే అంచనాలతో పాటు అమెరికాలో నిరుద్యోగ ప్రయోజనాలకు గతవారం 10లక్షల మందికి పైగా దరఖాస్తు చేయడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై సందేహాలను పెంచింది. ఈ నేపథ్యంలో పసిడిపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు.
భారీగా పెరిగి.. తగ్గుతూ..
ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లు, కరోనా మహమ్మారి, డాలర్ వ్యాల్యూ, ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితులు వంటివి పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. అలాగే, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న పసిడి నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ ప్రభావం కూడా ఉంటుంది. ఈ ఏడాది పసిడి ధరలు భారీగా పెరిగాయి. కరోనాకు ముందు 10 గ్రాముల బంగారం రూ.40వేల లోపు ఉండగా, ఆ తర్వాత రూ.57 వేల సమీపానికి చేరుకొని, ఇప్పుడు రూ.52వేల దిగువకు వచ్చింది.