పసిడి రూ.800 డౌన్, వెండి రూ.2,000కు పైగా.. భారీగా తగ్గిన ధరలు, అంతలోనే...
బంగారం ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న భారీగా పడిపోయిన ధరలు, ఆ తర్వాత కాస్త పెరిగాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పైన ఉండనుంది. దేశీయ మార్కెట్లో సోమవారం పసిడి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావానికి తోడు వివిధ కారణాలతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధర రూ.800కు పైన తగ్గి రూ.50,910 పలికింది. కిలో వెండి ఏకంగా రూ.2,150కి పైగా దిగి వచ్చింది. వెండి ధర రూ.65,725 పలికింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీపై స్పష్టత కొరవడటం వంటి కారణాలు పసిడి పతనానికి దారి తీశాయని అంటున్నారు.
పసిడి భారీ పతనానికి యూరోపియన్ అడ్డు
ఫెడ్ రిజర్వ్ పాలసీపై స్పష్టత లేకపోవడం బంగారంపై ఒత్తిడిని తగ్గించింది. ఎందుకంటే ఇన్వెస్టర్లు డైలమాలో ఉండి, ఆచితూచి వ్యవహరిస్తున్నారు. యూరోపియన్లోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కఠిన నియంత్రణలు చేపట్టారు. ఈ ప్రభావంతో బంగారం ధరలు మరింత భారీగా పడిపోకుండా నిలువరించాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. లేదంటే పసిడి ధరలు మరింతగా తగ్గేవని అంచనా వేస్తున్నారు. కరోనా తాజా నియంత్రణల నేపథ్యంలో పసిడి భారీ పతనానికి అడ్డుపడిందని అంటున్నారు. యూఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధుల కమిటీ ముందు మాట్లాడనున్నారు. ఆయన ప్రకటనను బట్టి పసిడి ధరల తదుపరి ధరలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు.
ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ.. పసిడి పాతాళానికి!
దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఓ సమయంలో భారీగా పడిపోయాయి. నిన్న రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ఏకంగా 50 డాలర్లకు పైగా పతనమై 1,908 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కీలక మద్దతుస్థాయి 1900 డాలర్ల దిగువకు కూడా పడిపోయి, 1882 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి 1918 డాలర్లకు పెరిగాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1921.50 పలికింది. కరోనా నేపథ్యంలో గత నెలలో పసిడి తొమ్మిదేళ్ల గరిష్టం 1,911 డాలర్లను దాటింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 2,075ను దాటింది. ఇప్పుడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఏకంగా 200 డాలర్ల వరకు క్షీణించింది. స్వల్పకాలంలో అస్థిరంగా, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో పసిడి పెట్టుబడులపై నిపుణులు సానుకూలంగా స్పందిస్తున్నారు.
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్లో ఓ సమయంలో పసిడి 10 గ్రాములు రూ.1500 వరకు క్షీణించి రూ.50,300 పలికింది. వెండి ఫ్యూచర్స్ 6,000కు పైగా తగ్గి రూ.61,802 వద్ద ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో బంగారం 0.52 శాతం పెరగగా, వెండి 0.2 శాతం తగ్గింది. నిన్న చివరకు అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.4 శాతం తగ్గింది.
తర్వాత సెషన్లో ఒత్తిడి
వివిధ కారణాలతో ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా కరోనా కేసులు పెరగడం, యూరోపియన్ దేశాల్లో లాక్ డౌన్ వంటి అంశాలతో ఇన్వెస్టర్లు డైలమాలో ఉన్నారు. లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డాలర్ వ్యాల్యూ నిలకడగా ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో తర్వాత సెషన్లో పసిడిధరలు పెరిగాయి. డాలర్ రికవరీ నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి పెరిగింది.