మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు, అదే జరిగితే రూ.5,000 వరకు తగ్గుతుందా?
బంగారం ధరలు నేడు (ఆగస్ట్ 19, బుధవారం) తగ్గాయి. రెండు రోజులుగా పెరుగుతున్న ధరలు ఈ రోజు పడిపోయాయి. మధ్యాహ్నం సమయానికి వెండి 0.83 శాతం పడిపోయింది. కిలో వెండి రూ.2,863 తగ్గి రూ.67,135 పలికింది. 10 గ్రాముల పసిడి ధర రూ.53,424 పలికింది. క్రితం సెషన్లో రూ.54,856 వద్ద క్లోజ్ అయింది. నిన్నటితో పోలిస్తే రూ.1,180 క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 2,005 డాలర్లు పలికింది. వెండి పెరిగి 28.15 డాలర్లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.7 శాతం తగ్గి 1,987 డాలర్లు పలికింది.
ఇక్కడ తగ్గిన బంగారం ధరలు, ఎంతంటే? డాలర్ దెబ్బతో అక్కడ రికార్డ్ ధర దిశగా...
వేలల్లో పెరిగిన పసిడి, వెండి ధరలు
బంగారం ధరలు గత రెండు రోజుల్లో రూ.1500 వరకు పెరిగింది. ఈ రోజు దాదాపు రూ.1400కు పైగా పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఒడిదుడుకుల్లో ఉండటంతో దేశీయ మార్కెట్లో పసిడి, వెంటి ధరలు క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల్లో అనిశ్చితి నెలకొందని, ఔన్స్ పసిడి 2000 డాలర్ల వద్ద స్థిరపడినా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ఉద్దీపన ప్యాకేజీపై అమెరికా తీసుకునే చర్యలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.
అదే జరిగితే 10 శాతం తగ్గుదల
బంగారం ధరలు గత మూడు నెలల్లో 18 శాతం పెరిగాయి. రష్యా వాక్సిన్ పైన ప్రస్తుతం కొన్ని అనుమానాలు ఉన్నాయి, అది విజయవంతమైనా లేదా మరిన్ని దేశాల వ్యాక్సీన్లు వచ్చినా బంగారం ధరల పతనం పది శాతం నుండి పదిహేను శాతం వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే రూ.5వేలు అంతకంటే ఎక్కువగా తగ్గే అవకాశాలు ఉండొచ్చు. అప్పుడు రిటైల్ సేల్స్ పెరిగే అవకాశముంది.
హైదరాబాద్ ధర
హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.55,300 పైన పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.50,700 పలికింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పుంజుకుంది. గ్లోబల్ మార్కెట్, కరోనా, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, డాలర్ వ్యాల్యూ, వడ్డీ రేట్లు వంటి ప్రభావం పసిడిపై ఉంటుంది.