లాక్డౌన్ టైంలో ఇలా పెరిగిన బంగారం ధర, గతవారంలో ఇలా భారీగా తగ్గింది..
బంగారం, వెండి ధరలు గత వారంలో నాలుగు రోజులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం నుండి గురువారం ఉదయం మధ్య పసిడి 10 గ్రాములు రూ.1,810, వెండి కిలో రూ.9,655 క్షీణించాయి. శుక్రవారం నాటి ఎంసీఎక్స్లో మరో రూ.200కు పైగా తగ్గింది. మొత్తంగా వారంలో పసిడి రూ.2000కు పైగా తగ్గింది. గత నెల ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం నుండి బంగారం రూ.6,500 క్షీణించగా, వెండి కిలో రూ.20,000 వరకు తగ్గింది. బులియన్ మార్కెట్లో భారీగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు ఔన్స్ 1900 డాలర్లకు దిగి వచ్చి, 1850 డాలర్లు కూడా పలికాయి.
ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డ్, తగ్గిన బంగారం నిల్వలు
లాక్ డౌన్ కాలంలో పసిడి ధరలు ఎలా పెరిగాయంటే
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు నాలుగు దశల లాక్ డౌన్ విధించారు. మొదటి దశ మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు విధించారు. ఈసమయంలో 24 క్యారెట్ల పసిడి రూ.2,610 మేర పెరిగింది. అయితే రెండో ఫేజ్ లాక్ డౌన్ సమయంలో పసిడి స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ 15 నుండి మే 3 (రెండో ఫేజ్ లాక్ డౌన్) మధ్య పసిడి రూ.100కు పైగా తగ్గింది. ఇక, మే 3 నుండి మే 17వ తేదీ వరకు మూడో ఫేజ్ లాక్ డౌన్ సమయంలో పసిడి ధర రూ.1,150కు పైగా పెరిగింది. 4వ ఫేజ్ లాక్ డౌన్ మే 18 నుండి మే 31వ తేదీ సమయంలో పసిడి ధర దాదాపు 800 పెరిగింది. మొత్తంగా జనవరి నుండి మే 22వ తేదీ వరకు పసిడి ధరలు రూ.7,000 వరకు పెరిగాయి. ఆ తర్వాత అంతకంతకూ పెరుగుతూ ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పైకి చేరుకున్నాయి. ఆగస్ట్ 7న పసిడి రూ.56,254 వద్ద ప్రారంభమై చివరకు రూ.56,126 వద్ద క్లోజ్ అయింది. ఇక వెండి ధర రూ.76వేలకు పైన ప్రారంభమై, రూ.75వేల పైన ముగిసింది. ఆ తర్వాత నుండి మళ్లీ రూ.6,500 వరకు క్షీణించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కిలో వెండి 2011లో రూ.77,000కు చేరుకుంది.
బంగారం ధరలు
సోమవారం నుండి శనివారం వరకు బంగారం మార్కెట్ ధరలు మారుతుంటాయి. ఆదివారం ట్రేడింగ్ ఉండదు. కొద్దిపాటి మార్పులతో శనివారం సాయంత్రం ముగింపు ధరకు అమ్మకాలు జరుగుతాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల పసిడి రూ.52,500 దిగువకు చేరుకున్నాయి. 22 క్యారెట్ల పసిడి రూ.48వేల దిగువకు చేరుకుంది.
ఈ వారంలో తగ్గుదల ఇలా...
గతవారం ప్రారంభం సెప్టెంబర్ 21న పసిడి ధరలు రూ.250 వరకు తగ్గింది. ఆ తర్వాత వరుసగా రూ.500కు పైగా తగ్గుతూ వచ్చింంది. తిరిగి శనివారం మళ్లీ రూ.200కు పైన తగ్గింది. మొత్తంగా రూ.2000 వరకు తగ్గుదల నమోదు చేసింది. గత వారం ప్రారంభంలో రూ.54వేల పైన ప్రారంభమైన ధర, శనివారం సాయంత్రానికి రూ.52వేలకు పైన ముగిసింది.