భారీగా పెరిగిన బంగారం ధర, అక్కడ ఏకంగా రూ.1,000కి పైగా జూమ్
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి పెరగడం, ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లడంతో కొద్ది రోజుల క్రితం వరకు పసిడి ధరలు రోజురోజుకు పెరిగాయి. అయితే వైరస్ తగ్గుముఖం పట్టడం, రికవరీ పెరగడం, వ్యాక్సీన్ అంచనాలు, తద్వారా ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటుండటంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అయితే తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
జూమ్ గుడ్న్యూస్, బెంగళూరులో కొత్త టెక్ సెంటర్, కొత్త
ఔన్స్ రూ.1,100కు పైగా పెరుగుదల
కేవలం 15 నిమిషాల్లోనే ఔన్స్ బంగారం ధర 15 డాలర్లు (రూ.1,100కు పైగా) ఎగిసింది. తద్వారా స్పాట్ గోల్డ్ ఓ సమయంలో 1,866.90 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత 1,842 డాలర్లకు చేరుకుంది. తొమ్మిదేళ్ల గరిష్టానికి పెరిగింది. అమెరికా ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనుందని అంచనాలు, వ్యాక్సీన్ పైన వస్తున్న వార్తలు బులియన్ కొనుగోలుదారులకు ఫేవర్గా ఉన్నాయి. దీంతో 2011 సెప్టెంబర్ నుండి గరిష్టానికి చేరుకుంది. వెండి ధర 22.22 డాలర్లకు పెరిగింది. 2011 సెప్టెంబర్లో ఔన్స్ బంగారం 1,920 డాలర్లు రికార్డ్ ధర పలికింది.
మన దేశంలో పరుగులు..
బంగారం ధర పరుగులు పెడుతోంది. 10 గ్రాముల బంగారం రూ.50వేలకు పైగా పలుకుతోంది. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములు రూ.50,214గా ఉంది. సోమవారంతో పోలిస్తే దాదాపు రూ.200 పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనుకావడంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూశారు. దీంతో మార్కెట్లో డిమాండ్ లేకపోయినప్పటికీ.. ఇన్వెస్టర్లు ఎగబడటంతో ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో ధర ఈ ఒక్కరోజే రూ.1,800కు పైగా పెరిగి రూ.56,441 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ 2013 గరిష్టానికి చేరుకుంది.
ఉద్దీపనల ఎఫెక్ట్
కరోనా కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థలను రక్షించుకునేందుకు అమెరికా, ఐరోపా యూనియన్లు మరిన్ని ఉద్దీపనలను ప్రకటిస్తాయన్న ఆశలు కూడా బంగారం ధరలను అంతకంతకూ పెంచుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.