Gold Price Today: బంగారం ధరలు మరింతగా పెరుగుతాయా?
న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరిగాయి. అదే సమయంలో వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్ట్ 10వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో(MCX) పసిడి ధరలు రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఇప్పుడు రూ.51,600కు దిగి వచ్చింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.59వేలు దాటింది. 22 క్యారెట్ల పసిడి రూ.53,850 పలికింది. నాటి ధరలతో పోలిస్తే ఇప్పుడు రూ.5వేలకు పైగా తగ్గింది. వెండి ధర కూడా కిలో రూ.68,500 పలికింది. ఆగస్ట్ 7న కిలో వెండి రూ.78వేల వరకు ఉంది. నాటి ధరతో వెండి కిలో రూ.10వేల వరకు తక్కువగా ఉంది.
పండుగ సీజన్ కోసం రెడీ
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగి ఔన్స్ 1,957 డాలర్లు పలికింది. ధరలు స్థిరంగా ఉంటే రాబోయే రెండు వారాల్లో డిమాండ్ మెరుగుపడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దేశీయ మార్కెట్లో పండుగ సీజన్ కోసం రిటైలర్లు సిద్ధమవుతున్నారు. కరోనా కేసులు పెరగడం, ఆర్థిక వ్యవస్థ నిరాశాజనకంగా ఉండటంతో బంగారం డిమాండ్ను తగ్గిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పసిడి ధరలు స్థిరంగా ఉంటే కొంత మేలు అని భావిస్తున్నారు. ఈక్విటీలు, అమెరికా డాలర్ పై పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి.
అప్పుడు బంగారం ధరలు పెరగవచ్చు
దీపావళి నాటికి బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాక్సీన్ నవంబర్ నెలలో వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి రాజకీయ ప్రకటనలుగా భావిస్తున్నారు. అదే అయితే నవంబర్ నాటికి వ్యాక్సీన్ రాకుంటే బంగారం ధరలు క్రమంగా పెరుగుదలను నమోదు చేస్తాయని అంటున్నారు.
పైపైకి.. కిందకు..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 2000 మార్క్ చేరుకుంటే ఆ తర్వాత 2100 డాలర్ల దిశగా వేగంగా వెళ్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 1925 డాలర్లకు వస్తే మాత్రం 1900 డాలర్ల స్థాయికి రావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.