భారీగా పెరిగిన బంగారం దిగుమతులు, కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం
కరెంట్ ఖాతా లోటు పైన (CAD) నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి ఫిబ్రవరి వరకు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్లుగా నమోదయింది. అదే సమయంలో 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలో దిగుమతులు 26.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2022లో బంగారం దిగుమతులు 11.45 శాతం క్షీణించి 4.7 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
పసిడి దిగుమతులు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు 176 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ లోటు 86 బిలియన్ డాలర్లుగా నమోదయింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ కారణంగా దిగుమతులు మరింత పెరిగే అవకాశముందని, ఇది కరెంట్ ఖాతా లోటు పైన మరింత ఎత్తిడి పెరగవచ్చునని అంటున్నారు.
ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న రెండో దేశం భారత్. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలు ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. పైన తెలిపిన 9 నెలల వ్యవధిలో భారత్ 842.28 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రత్నాభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.