పెరిగిన పెట్రోల్ ధరలు, ముంబైలో రూ.90కి చేరువలో..: ఏ నగరంలో ఎంత ధర?
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు గురువారం (డిసెంబర్ 3) పెరిగాయి. వరుసగా రెండో రోజు పెరిగాయి. మెట్రో సిటీల్లో లీటర్ పైన దాదాపు 20 పైసల చొప్పున పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ నోటిఫికేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 17 పైసలు పెరిగి రూ.82.66, డీజిల్ ధరలు 19 పైసలు పెరిగి రూ.72.84కు చేరింది. గత 14 రోజుల్లో పెట్రోల్ ధరలు 11 రోజులు పెరిగాయి.
SBI యోనో యాప్లో ఎర్రర్, కస్టమర్ల తీవ్ర అసహనం: ట్విట్టర్లో వెల్లువ..
ఏ నగరంలో ఎంత ధర?
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.66, డీజిల్ ధర రూ.72.84, ముంబైలో పెట్రోల్ రూ.89.33, డీజిల్ 79.42, చెన్నైలో పెట్రోల్ రూ.85.59, డీజిల్ రూ.78.24, కోల్కతాలో పెట్రోల్ 84.18, డీజిల్ రూ.76.41గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర రూ.90కి చేరువలో ఉంది.
నవంబర్ 30వ తేదీనే భోపాల్లో పెట్రోల్ ధర రూ.90 దాటింది. ఇండోర్, ఔరంగాబాద్ తదితర నగరాల్లోను ఈ మార్కు క్రాస్ చేసింది. పెట్రోల్ ధర రూ.90 దాటిన నగరాలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (VAT) ఇక్కడ 39 శాతం ఎక్కువ అని, అందుకే రూ.90ని క్రాస్ చేసింది.
బ్యారెల్ ధర పెరిగితే...
గత రెండు వారాల్లో పెట్రోల్ ధర లీటర్ పైన రూ.1.45 పెరిగింది. డీజిల్ పైన రూ.2.15 పెరిగింది. బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 48 డాలర్లు దాటింది. నవంబర్ నెలలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 44 డాలర్లకు అటు ఇటు కదలాడింది. క్రూడాయిల్ ధర బ్యారెల్ పైన ఒక డాలర్ పెరిగిందంటే ఇక్కడ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పైన 40 పైసలు పెంచవలసి ఉంటాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో పోలిస్తే రూ.2 వరకు పెరగాలని అంటున్నారు.
వ్యాక్సీన్ సానుకూల ప్రకటనతో..
వ్యాక్సీన్ సానుకూల ప్రకటనల నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. దాదాపు రెండు నెలల విరామం అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. నవంబర్ 22వ తేదీకి ముందు సెప్టెంబర్ 22వ తేదీన పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత రెండు నెలల పాటు మార్పులేదు. డీజిల్ ధర అక్టోబర్ 2వ తేదీన పెరిగింది. ఆ తర్వాత మార్పులేదు. అనంతరం నవంబర్ 20వ తేదీ నుండి పెరిగాయి. ఇక గత పద్నాలుగు రోజుల్లో పదకొండు సార్లు పెరిగాయి.